
ఖమ్మంలో తెల్లవారుజాము నుంచే క్యూ
ఖమ్మం సంక్షేమ విభాగం, మే 8 : కరోనా మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తుండటంతో టెస్టుల కోసం ప్రజలు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ల్యాబ్ల వద్ద కూడా బారులు తీరుతున్నారు. ఖమ్మంలోని ల్యాబ్ల వద్ద ఉదయం 6 గంటలకే పరీక్షల కోసం జనం క్యూలో నిల్చుంటున్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్, ట్రూనాట్ పరీక్ష కిట్లు అందుబాటులో లేవు. కేవలం మొబైల్ వాహనాల ద్వారానే కరోనా టెస్టులు చేస్తున్నారు. దీంతో కరోనా లక్షణాలు ఉన్నవారు తెల్లవారుజాము నుంచే టెస్టులు నిర్వహించే ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో గంటలకొద్దీ ప్రైవేట్ ల్యాబ్ల వద్ద క్యూలో ఉండి పరీక్షలు చేయించుకుంటున్నారు.
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా నగరంలో పాజిటివ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కలెక్టర్ కర్ణన్ జోక్యం చేసుకొని ఖమ్మంలో కరోనా పరీక్షలు పెంచాలని ప్రజలు కోరుతున్నారు.