Andhra Pradesh Top News | మొగల్తూరు బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రతిపక్ష వైసీపీ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా ఎన్డీఏ కూటమి విజయం తథ్యమన్నారు.
ఆ ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించడం, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చైర్మన్లు, మేయర్ల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించడం ద్వారా ‘ఆయారామ్-గయారామ్’ కల్చర్ లేకుండా 5 ఏళ్లపాటు స్థిరమైన పాలన సాగేలా చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు.
గొడ్డలి పార్టీ బెదిరింపులకు పాల్పడుతోంది.. ఏకగ్రీవాలు తప్పవు..
ఏకగ్రీవం అయితే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వమని గొడ్డలి పార్టీ నాయకుడు బెదిరింపులకు పాల్పడుతున్నారు. వాస్తవానికి ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రభుత్వాలే ప్రోత్సహించాయన్నారు. ఇకనుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల చైర్మన్, మేయర్ల ఎన్నికను సైతం ప్రత్యక్ష విధానంలోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. 1996 నుంచి బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను గత ప్రభుత్వం తగ్గించిందని, దాన్ని మళ్లీ పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తే కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
ఓటర్ల జాబితా రివిజన్ (SIR) ప్రక్రియ పూర్తయ్యే వరకు స్థానిక ఎన్నికలు జరగకుండా నిలిపివేయాలని కోర్టులను ఆశ్రయించడం వెనుక చిత్తుగా ఓడిపోతామనే భయమే కారణమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలు, స్థానిక సంస్థల అభివృద్ధికి కేంద్రం నుంచి సకాలంలో నిధులు రావాలన్నా, క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారమవ్వాలన్నా ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు వార్డు సభ్యులు, సర్పంచులు కూడా ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేసే సంస్కృతికి స్వస్తి పలకాలని, సమాజంలో వ్యాపించిన ఈ కలుషిత వాతావరణాన్ని ప్రజలందరూ కలిసి కడిగేయాలని, వివేకంగా ఆలోచించి అడుగేయాలని పిలుపునిచ్చారు.
ప్రజా పాలనలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ‘ఏఐ ట్యూటర్’, ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు AI Doctor వంటి అధునాతన డిజిటల్ వ్యవస్థలను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని 1.60 కోట్ల కుటుంబాలకు నాణ్యమైన సేవలను ఆన్లైన్ వేదికగా వేగంగా అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు, సరిగ్గా 31 ఏళ్ల క్రితం (1995 సెప్టెంబరు 1న) తాను తొలిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రజల ఆప్యాయతకు ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేనని భావోద్వేగానికి లోనయ్యారు. సంక్షేమం అనేది పేదలను ఆర్థికంగా నిలబెట్టేలా ఉండాలని, తాత్కాలిక ఉపశమనానికే పరిమితం కాకూడదని పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, ‘దీపం’ కింద ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి కూటమి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి ప్రజలు, మేధావులు సలహాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
Author : Shankar Dukanam

