Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్

Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్

ABP దేశం 2 weeks ago

Rahul Gandhi Attack Amit Shah Pellet Guns: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన రాజీనామాతో భారత జాతీయ రాజకీయం మునుపెన్నడూ లేనంతగా ఊహించని మలుపు తిరిగింది.

నీట్-యుజీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ, విద్యావ్యవస్థలోని అక్రమాలపై దేశవ్యాప్తంగా విరుచుకుపడిన జెన్-జీ విద్యార్థుల ఆగ్రహజ్వాలల ముందు గత పన్నెండేళ్లుగా తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న మోదీ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. విద్యార్థులు చేపట్టిన వీధి పోరాటం ఒక వైపు, పార్లమెంట్ లోపలా బయటా విపక్షాలు సృష్టించిన గందరగోళం మరోవైపు కేంద్రాన్ని తీవ్ర రక్షణాత్మక ధోరణిలోకి నెట్టివేశాయి. గత 12 ఏళ్ల మోదీ పాలనలో ప్రజా పోరాటాల ఒత్తిడికి తలొగ్గి ఒక క్యాబినెట్ హోదా కలిగిన కీలక మంత్రి రాజీనామా చేయడం ఇదే తొలిసారి కావడంతో, జాతీయ రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య సరికొత్త నెరేటివ్ యుధ్ధం ముదిరింది.

అనుకూలంగా మల్చుకుంటున్న రాహుల్ గాంధీ

ఈ రాజకీయ సంక్షోభాన్ని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అత్యంత వ్యూహాత్మకంగా తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ప్రధాన్ రాజీనామాను కేవలం విద్యాశాఖ వైఫల్యంగా మాత్రమే కాకుండా, మ్యాగ్జిమమ్ ప్రెషర్ వ్యూహంతో నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా దాడిని ఉధృతం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి గల్లీల వరకు వ్యాపించిన యువత అసంతృప్తిని, నిరుద్యోగ సమస్యను ఒకే వేదికపైకి తెస్తూ.. ఈ విజయం విద్యార్థుల ప్రజాస్వామ్య పోరాట విజయాంశంగా రాహుల్ అభివర్ణించారు. ప్రధాన్ నిష్క్రమణ అనేది కేవలం ఆరంభం మాత్రమేనని, కేంద్రం తన వైఖరి మార్చుకోకపోతే దీనికి పదింతల స్థాయిలో నిరసనలు ఎదుర్కొనక తప్పదని ఆయన హెచ్చరించడం కాంగ్రెస్ అగ్రెసివ్ మూడ్ను స్పష్టం చేస్తోంది.

అమిత్ షా టార్గెట్గా రాహుల్, ప్రియాంక రాజకీయం

విద్యామంత్రి వికెట్ పడగానే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ద్వయం తమ తదుపరి రాజకీయ బాణాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వైపు మళ్లించారు. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న శాంతియుత విద్యార్థులపై పోలీసులు బలప్రయోగానికి దిగడం, పెల్లెట్ తుపాకులు, ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించారని ఆరోపిస్తూ హోంశాఖపై నేరుగా దాడి ప్రారంభించారు. మీ భవిష్యత్తు కోసం పోరాడుతున్న జెన్-జీ యువతపై పెల్లెట్ల వర్షం కురిపించింది అమిత్ షానే అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపివేస్తున్నాయి. లా అండ్ ఆర్డర్ పేరుతో విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేసేందుకు యత్నించారనే ముద్రను అధికార యంత్రాంగంపై వేయడంలో ప్రతిపక్షాలు సఫలమయ్యాయి.

మోదీ ఇన్ఫ్లూయన్సర్ పని చేసుకోవాలంటున్న దీప్కే

ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వంటి డిజిటల్-ఫస్ట్ నాయకులు సోషల్ మీడియాలో సృష్టిస్తున్న నెరేటివ్ బీజేపీ సాంప్రదాయ ప్రచార వ్యూహాలకు సవాలుగా మారింది. విద్యామంత్రి ప్రధాన్ను మార్చినట్లే.. త్వరలోనే ప్రధానమంత్రిని కూడా మార్చేస్తాం, మోదీ ఇక పొలిటికల్ ఇన్ఫ్లూయెన్సర్గా స్థిరపడవచ్చు అంటూ వారు వేస్తున్న ఘాటు సెటైర్లు, మీమ్లు డిజిటల్ ప్లాట్ఫామ్లపై విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ తరహా ఇన్ఫార్మల్, నాన్-పొలిటికల్ దాడిని తట్టుకోవడం సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బహుళ ఐటీ సెల్ వ్యవస్థలకు కూడా పెద్ద పరీక్షగా మారింది.

జాగ్రత్తగా డీల్ చేస్తున్న బీజేపీ

ఈ విద్యార్థి ఉద్యమం మరింత తీవ్రమై దేశవ్యాప్త శాంతిభద్రతల సమస్యగా, హింసాత్మక ఘర్షణలుగా మారకముందే చేదు మాత్ర మింగక తప్పదు అనే ప్రాగ్యామాటిక్ నిర్ణయానికి బీజేపీ వచ్చినట్లు కనిపిస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్కు పార్టీ పరంగా పూర్తి మద్దతు ఉన్నప్పటికీ, జెన్-జీ ఆగ్రహం ఓటు బ్యాంకుగా మారకముందే నష్టనివారణ చర్యల్లో భాగంగా ఆయన చేత రాజీనామా చేయించారు. అయితే ప్రధాన్ను కేవలం జంతర్ మంతర్ ఉద్యమానికి కట్టుబడి దిగిపోయినట్లు చూపిస్తూ, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పొలిటికల్ క్రెడిట్ దక్కకుండా చేసేందుకు బీజేపీ వ్యూహకర్తలు ప్రయత్నిస్తున్నారు. ప్రధాన్ సైతం తన రాజీనామా లేఖలో దేశద్రోహ శక్తులు ఈ పరిస్థితిని వాడుకోకుండా ఉండేందుకే తప్పుకుంటున్నాను అని పేర్కొనడం ఈ కౌంటర్ నెరేటివ్లో భాగమే. పార్లమెంటరీ బలంతో పాటు సంపూర్ణ మెజారిటీ ఉన్న బీజేపీకి.. జెన్-జీ డిజిటల్ యాక్టివిజమ్, వీధి పోరాటాలు , రాహుల్ గాంధీ కల్పిస్తున్న రాజకీయ వత్తిడి సరికొత్త సంక్షోభాన్ని తెచ్చిపెట్టాయి .

Author : Raja Sekhar Allu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam