Telangana Formation Day 2026: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 12 ఏళ్లు పూర్తయింది. ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, పోరాటాల మధ్య 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.
ఈ సందర్భంగా పరేడ్గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సందర్భంగా సికింద్రాబాద్లోని పరేడ్గ్రౌండ్స్లో మల్కాజిగిరి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
జాతీయ పతాకం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
మంగళవారం నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతకాకం ఆవిష్కరించి వేడుకలు వేడుకలు ప్రారంభించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. అంతకుముందు తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుగా గన్ పార్క్ కు చేరుకున్నారు. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్నారు.
ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ములుగులో మంత్రి సీతక్క, వరంగల్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సహా పలువురు మంత్రులు ఆయా జిల్లాల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను ఎగురవేశారు. అసెంబ్లీ వద్ద స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలిలో గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, శాసనసభ సిబ్బంది రాష్ట్ర అవతరణ వేడుకల్లో హాజరయ్యారు.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పోలీసులు
సీఎం రేవంత్రెడ్డితో పాటు దాదాపు 6 వేల మంది విశిష్ట అతిథులు విచ్చేస్తుండటంతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించడానికి మొత్తం 1,140 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ బందోబస్తు విధుల్లో ముగ్గురు డీసీపీలు, నలుగురు అదనపు డీసీపీలు, 8 మంది ఏసీపీలు, 49 మంది ఇన్స్పెక్టర్లు, 88 మంది ఎస్సైలతో పాటు 723 మంది ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొంటున్నారు.
ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఆహ్వానితులు, అతిథులు ఉదయం 7:30 గంటలకల్లా పరేడ్గ్రౌండ్స్ ప్రాంగణానికి చేరుకోవాలని మల్కాజిగిరి కమిషనర్ బి.సుమతి ఒక ప్రకటనలో సూచించారు. వేడుకల కోసం మైదానంలో మొత్తం 12 గేట్లను సిద్ధం చేశామని, తమకు కేటాయించిన పాస్ల ఆధారంగానే నిర్దేశిత గేట్ల ద్వారా అతిథులు లోపలికి ప్రవేశించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సభకు వచ్చే ప్రతి ఒక్కరూ కచ్చితంగా తమ పాస్లను వెంట తీసుకురావాలని కోరారు. భద్రతా నిఘా కోసం పరేడ్గ్రౌండ్స్ పరిసరాల్లో 55 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వివరించారు.
మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పరేడ్గ్రౌండ్స్ సమీప ప్రాంతాల్లో కఠినమైన నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు మల్కాజిగిరి కమిషనర్ సుమతి పేర్కొన్నారు. ముఖ్యంగా బేగంపేట, బోయిన్పల్లి, మారేడ్పల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో డ్రోన్లు, పారాగ్లైడర్లు, తేలికపాటి ఎయిర్క్రాఫ్టుల ఎగరవేతపై నిషేధం విధించారు. వీటితో పాటు ఆయుధాలు, పదునైన లేదా మండే స్వభావమున్న వస్తువులు, లేజర్ లైట్లను పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరేడ్గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని, బేగంపేట, సికింద్రాబాద్, తిరుమలగిరి, బోయిన్పల్లి, ట్యాంక్బండ్ మీదుగా ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
Author : Shankar Dukanam

