మంజుల గుర్తు ఉన్నారా? విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ 'మనుషులంతా ఒక్కటే', 'మగాడు', 'నేరం నాది కాదు ఆకలిది'... నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు 'దొరబాబు', 'బంగారు బొమ్మలు', 'మహాకవి క్షేత్రయ్య', సూపర్ స్టార్ కృష్ణ 'మాయదారి మల్లిగాడు', 'రక్త సంబంధాలు'...
శోభన్ బాబు 'మంచి మనుషులు', 'పిచ్చి మారాజు' వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తెలుగులో మాత్రమే కాదు... తమిళ, కన్నడ భాషల్లోనూ అగ్ర కథానాయికగా వెలుగొందారు. ఇప్పుడు ఆమె మనవరాలు వెండితెరపై అడుగు పెట్టేందుకు రెడీ అయ్యారు.
'అగధ' సినిమాలో మంజుల మనవరాలు!
అగ్ర దర్శక నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా 'అగధ'. ఇందులో మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్ నటిస్తున్నారు. 'దేవి' సినిమాతో మంజుల కూతురు వనితను నటిగా పరిచయం చేశారు ఎంఎస్ రాజు. ఇప్పుడు మంజుల మనవరాలు, వనిత కుమార్తె జోవికా విజయ్ కుమార్ ను పరిచయం చేస్తున్నారు.
జోవికా విజయ్ కుమార్ (Jovika Vijay Kumar)ను 'అగధ'తో నటిగా పరిచయం చేస్తున్నారు ఎంఎస్ రాజు. ఇందులో హరిణి పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. అలాగే, ఆమె క్యారెక్టర్ పోస్టర్ విడుదల చేశారు. జోరున కురుస్తోన్న వర్షంలో మసకబారిన పురాతన నేపథ్యంలో జోవికాను చూపించారు. కళ్ళలో అమాయకత్వం, ఆమెలో శక్తి ఉన్నట్టు అర్థం అవుతోంది. 'అగధ' సినిమా నుంచి ఇప్పటి వరకూ విడుదల చేసిన పోస్టర్లు అన్నిటికీ మంచి స్పందన లభించింది. ప్రతి పోస్టర్ కథలోని ఇంటెన్సిటీని ఆవిష్కరించే విధంగా ఉన్నాయి.
ఎంఎస్ రాజు రచన, దర్శకత్వంలో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ పతాకంపై కాశీ విశాలాక్షి బలుసు 'అగధ'ను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సినిమా చిత్రీకరణ 85 రోజుల పాటు చేశారు. సినిమాలో దాదాపు 45 నిమిషాల విఎఫ్ఎక్స్ ఉంటాయని తెలిపారు. ప్రేక్షకులకు 'అగధ' ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతి అందిస్తుందని యూనిట్ నమ్మకంగా ఉంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని తెరక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందీ సినిమా. ఈ చిత్రానికి సంగీతం: రాకేష్ వెంకటాపురం, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, కూర్పు: జునైద్ సిద్ధిఖీ, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్.
Author : S Niharika

