కరీంనగర్: కరీంనగర్ నగర నడిబొడ్డున పట్టపగలే ఓ గ్యాంగ్ కాల్పులు జరిపి, దోపిడీ చేయడం స్థానికంగా కలకలం రేపింది. నగరంలోని జ్యోతినగర్లో ఉన్న ప్రముఖ పీఎంజే (PMJ) జ్యువెలరీ షోరూమ్ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు.
కస్టమర్ల ముసుగులో లోపలికి చొరబడ్డ ఐదుగురు సాయుధ దుండగులు ఒక్కసారిగా తుపాకులు తీసి అక్కడి సిబ్బందిని, కస్టమర్లను తీవ్ర భయాందోళనలకు గురిచేశారు. దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన షోరూమ్ సిబ్బందిపై దుండగులు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల ఘటనలో నలుగురు షోరూమ్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆ గ్యాంగ్ షాపులో ప్రదర్శనకు ఉంచిన భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను బ్యాగుల్లో సర్దుకుని రెండు బైకులపై అక్కడి నుంచి పరారయ్యారు. బుల్లెట్ గాయాలైన వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కరీంనగర్ నగరంలో ఒక్కసారిగా హై అలర్ట్ ప్రకటించారు. 

