Dailyhunt
Mamata Banerjee: రాజీనామా చేసే ప్రశ్నే లేదు - మేము ఓడిపోలేదు - తేల్చేసిన మమతా బెనర్జీ

Mamata Banerjee: రాజీనామా చేసే ప్రశ్నే లేదు - మేము ఓడిపోలేదు - తేల్చేసిన మమతా బెనర్జీ

ABP దేశం 5 days ago

Mamata Banerjee No question of me resigning : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి. 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడుతూ బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించినప్పటికీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఓటమిని అంగీకరించడానికి నిరాకరిస్తున్నారు.

ఫలితాలు వెలువడి 24 గంటలు గడుస్తున్నా, ఆమె ఇంకా రాజీనామా చేయకపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మమతా బెనర్జీ అత్యంత ఆవేశంగా మాట్లాడారు. మేము ఓడిపోలేదు, ఇది ప్రజల తీర్పును అపహాస్యం చేయడమే అని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్, కేంద్ర బలగాలు కుట్ర పన్ని ఓట్లను కొల్లగొట్టాయని, బీజేపీ విజయం అనైతికమని ఆమె మండిపడ్డారు. ఈ క్రమంలోనే నేను ఎందుకు రాజీనామా చేయాలి? మేము ఎన్నికల్లో ఓడిపోలేదు అంటూ ఆమె చేసిన ప్రకటన రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది.

ఈ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఒక విలన్ పాత్ర పోషించిందని, ప్రజల ప్రజాస్వామ్య హక్కులను, ఈవీఎంలను లూటీ చేసిందని ఆమె మండిపడ్డారు. దేశ చరిత్రలో తాను ఇలాంటి ఎన్నికలను ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటింగ్ ముగిసిన తర్వాత కూడా ఈవీఎంలలో 80 నుంచి 90 శాతం ఛార్జింగ్ ఉండటం ఎలా సాధ్యం? ఇది ముమ్మాటికీ అక్రమమే అని ఆమె ప్రశ్నించారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు నుంచే తమ పార్టీ నాయకులను అరెస్టు చేయడం, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం ద్వారా కేంద్రం కుట్రలకు తెరలేపిందని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికలు బీజేపీకి, ఎన్నికల సంఘానికి మధ్య జరిగిన బెట్టింగ్ లా ఉన్నాయని మమత ఎద్దేవా చేశారు. మేము కేవలం ఒక రాజకీయ పార్టీతో కాదు.. మొత్తం వ్యవస్థతో పోరాడాము. ప్రధాని, హోం మంత్రులు నేరుగా జోక్యం చేసుకుని ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేశారు. బీజేపీ తన సొంత మనుషులను అధికారుల స్థానంలో కూర్చోబెట్టి ఈ ఆట ఆడింది అని ఆమె ఆరోపించారు. ఓటరు జాబితాలో భారీ అక్రమాలు జరిగాయని మమత పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ ద్వారా సుమారు 90 లక్షల మంది పేర్లను తొలగించారు. మేము కోర్టుకు వెళ్లిన తర్వాతే అందులో 32 లక్షల మంది పేర్లను మళ్ళీ చేర్చారు. ఇంతటి నీచమైన, మోసపూరితమైన రాజకీయాలను నేను నా జీవితంలో చూడలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎన్నికల్లో ఓడిపోలేదని, కుట్రపూరితంగా తమను ఓడించారని మమత స్పష్టం చేశారు. అధికారికంగా వారు మమ్మల్ని ఓడించి ఉండవచ్చు, కానీ నైతికంగా బెంగాల్ ప్రజల మద్దతు మాకే ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మా పోరాటం కొనసాగుతుంది అని ఆమె తేల్చి చెప్పారు.

ఫలితాలు వెలువడిన వెంటనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ థాకరే, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, హేమంత్ సోరెన్ వంటి అగ్రనేతలు తనకు ఫోన్ చేసి సంఘీభావం తెలిపారని మమత వెల్లడించారు. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ నాకు అండగా నిలిచాయి. మా ఐక్యత రాబోయే రోజుల్లో మరింత బలోపేతం అవుతుంది అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ రోజే కోల్‌కతా రావాలని భావించినప్పటికీ, రేపు రావాల్సిందిగా తానే కోరినట్లు ఆమె తెలిపారు. తన నిరాడంబరతను గుర్తు చేస్తూ మమత భావోద్వేగానికి లోనయ్యారు. నా జీవితమంతా ప్రజల సేవకే అంకితం చేశాను. ముఖ్యమంత్రిగా ఉన్న ఈ 15 ఏళ్లలో నేను ప్రభుత్వం నుంచి ఒక్క పైసా పెన్షన్ కానీ, జీతం కానీ తీసుకోలేదు. ఇప్పుడు నేను పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నాను. ప్రజల కోసం ఏం చేయాలో, ఎలా చేయాలో నాకు తెలుసు.. ఖచ్చితంగా ఆ పని పూర్తి చేస్తాను అని ఆమె తేల్చి చెప్పారు.

Author : Raja Sekhar Allu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam