మంచు బ్రదర్స్ విష్ణు మంచు (Vishnu Manchu), మనోజ్ మంచు (Manchu Manoj) మధ్య మనస్పర్థలు, విబేధాలు రోడ్డుకు ఎక్కిన విషయం తెలుగు ప్రజలు అందరికీ తెలుసు.
అప్పట్లో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. కట్ చేస్తే... ఇప్పుడు దర్శకరత్న దాసరి నారాయణ రావు వర్ధంతి (Dasari Narayana Rao Death Anniversary) సాక్షిగా వారిద్దరి మధ్య సఖ్యత లేదని మరోసారి అర్థమైంది. అన్నదమ్ములు వేర్వేరుగా దాసరి ఘాట్ క్లీనింగ్ చేపట్టడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే...
ముందు స్పందించిన మనోజ్ మంచు
దాసరి వర్ధంతికి ముందు రోజు ఆయన ఘాట్ (Dasari Ghat)ను చూస్తే... దిక్కులేని విధంగా దాసరి సమాధి ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. అక్కడ పరిస్థితిని పట్టించుకునే నాథుడు లేడని ఓ టీవీ యాంకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. మనోజ్ దృష్టికి రావడంతో స్పందించారు.
దాసరి వర్ధంతి రోజున ఉదయం ఏడు గంటలకు సమాధి దగ్గరకు మనోజ్ మంచు చేరుకున్నారు. తన బృందంతో కలిసి స్వయంగా క్లీన్ చేశారు. క్లీనింగ్ ఫోటోలు వైరల్ అయ్యాయి. దాసరి నారాయణ రావుకు నివాళులు అర్పించారు.
మనుషుల్ని పంపించిన విష్ణు మంచు
మనోజ్ మంచు స్వయంగా దాసరి ఘాట్ క్లీన్ చేస్తున్న విషయం తెలిసిందో... లేదు అంటే దాసరి వర్ధంతి నాడు ఆయన గుర్తుకు వచ్చారో... లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు మంచు తన మనుషుల్ని పంపించారు. ఘాట్ దగ్గర క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టారు. దాసరి విగ్రహానికి పాలాభిషేకం చేయించారు. హైదరాబాద్లో విష్ణు మంచు ఉన్నారా? లేదా? అనేది తెలియలేదు. అయితే ఆయన మనుషుల్ని పంపించి పాలాభిషేకం చేయించిన విజువల్స్ వైరల్ అయ్యింది. అందులో కొందరు చెట్లు కొడుతున్న విజువల్స్ ఉన్నాయి. దాంతో షాక్ అవ్వడం జనాల వంతు అయ్యింది.
మనోజ్ మంచు, విష్ణు మంచు... ఇద్దరిలో దాసరి ఘాట్ ఎవరు క్లీన్ చేయించారు? ఆ సమాధి చెంతకు ముందుగా ఎవరి మనుషులు చేరుకున్నారు? అనే సందేహాలు, ప్రశ్నలు ప్రజలకు రావడం సహజం. మనోజ్ స్వయంగా రంగంలో దిగాడు. విష్ణు మాత్రం మనుషుల్ని పంపించారు. క్రెడిట్ కోసం మంచు బ్రదర్స్ ట్రై చేస్తే... అసలు దాసరి నారాయణ రావు కన్న కుమారులు ఆచూకీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. వాళ్ళు అసలు స్పందించలేదు.
Author : S Niharika

