అమరావతి: తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
సకల జనుల సంకల్పం, అమరుల త్యాగాల రూపమే మన తెలంగాణ అని ఆయన కొనియాడారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ! అని దాశరథి కృష్ణమాచార్య పలికిన అక్షర సత్యం స్వేచ్ఛా గీతమై మ్రోగిన రోజు పుష్కరం (12 ఏళ్లు) క్రితం ఇదే రోజని గుర్తుచేశారు.
తెలంగాణ ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల పాటు సాగిన ప్రజల ఆకాంక్షలకు, ఆత్మగౌరవ పోరాటానికి, త్యాగాలకు ప్రతిఫలంగా నిలిచిన చారిత్రాత్మక ఘట్టం ఈ రాష్ట్ర ఆవిర్భావం. తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, ఉద్యోగులు, రైతులు, అమరవీరులకు తన నివాళులు అర్పించారు.
సాయంత్రం హైదరాబాద్లో ప్రెస్మీట్.. పోలీసులు అనుమతిస్తారా
జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మంగళవారం సాయంత్రం 4:30 నుండి 5:30 గంటల మధ్య ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో నెలకొన్న రాజకీయ వాతావరణం, అలాగే అంతకుముందు తన సభకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఈ ఈ నిర్ణయం తీసుకున్నారు. "కనీసం తన ఇంట్లో జనసేన పార్టీ నాయకులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టుకోవడానికైనా తెలంగాణ పోలీస్ శాఖ అనుమతి ఇస్తుందని ఆశిస్తున్నాను.. ఏం జరుగుతుందో చూద్దాం" అంటూ పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రభుత్వం, పోలీసుల తీరుపై కాస్త సెటైరికల్ పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
పోరాటాల పుట్టినిల్లు తెలంగాణ..
తెలంగాణ గడ్డ పోరాటాల పుట్టినిల్లని, ఇక్కడి గాలిలో పౌరుషం, నీటిలో ఉద్యమ ప్రవాహం, నేలలో అమరుల రక్తం ఉందంటూ పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు. సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తి నుంచి కొమురం భీమ్ వంటి మహనీయుల త్యాగాల వరకు, ఈ భూమి స్వాభిమానానికి, న్యాయపోరాటాలకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. భాష, సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలు, సాహిత్య సంపదతో భారతదేశ వైవిధ్యంలో తెలంగాణది ఒక విశిష్టమైన స్థానమని కొనియాడారు. తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల పట్ల తనకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన ఆవేదన, బాధ్యతాభావం ఉన్నాయని పవన్ స్పష్టం చేశారు. ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాల పరిస్థితి, గిరిజనుల హక్కులు, రైతుల సమస్యలు, నిరుద్యోగ యువత ఆశలు, విద్య, ఆరోగ్య రంగాల సవాళ్లను తాను కేవలం రాజకీయ అంశాలుగా కాకుండా, మానవీయ అంశాలుగా భావిస్తానని.. ప్రజల కష్టాలు ఏ ప్రాంతానివైనా, అవి మన అందరి బాధ్యత అనే నమ్మకం తనదని పేర్కొన్నారు.
దేశంలోనే పలు రంగాల్లో తెలంగాణ తనదైన ముద్ర
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఐటీ, ఔషధ పరిశ్రమలు, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, స్టార్టప్ వ్యవస్థ, విద్యా రంగాల్లో తన ప్రత్యేక ముద్రను వేసుకుంటోందని పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. అయితే అభివృద్ధి ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే ఆ అభివృద్ధి సంపూర్ణమవుతుందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువత, చిన్న రైతులు కూడా సమాన అవకాశాలతో ముందుకు సాగే తెలంగాణ నిర్మాణమే మనందరి లక్ష్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం జనసేన పోరాటం..
తెలంగాణ అంటే అపారమైన ఆత్మీయత, అపూర్వమైన సంస్కృతి, అద్భుతమైన మానవ సంబంధాల సమాహారమని పేర్కొన్నారు.. తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు జనసేన పార్టీ సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఈ 12వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మరింత ప్రగతి సాధించాలని, ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలని, సామాజిక న్యాయంతో ఈ గడ్డ దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ జై తెలంగాణ! జై హింద్!" అంటూ తన పోస్ట్ ముగించారు.
Author : Shankar Dukanam

