Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Regional sentiment gimmicks ahead of GHMC Elections |  GHMC ఎన్నికలే టార్గెట్టా? తెలంగాణ సెంటిమెంటు, సెట్లర్ ఓటు, కొత్త రాజకీయ సమీకరణాలు

Regional sentiment gimmicks ahead of GHMC Elections | GHMC ఎన్నికలే టార్గెట్టా? తెలంగాణ సెంటిమెంటు, సెట్లర్ ఓటు, కొత్త రాజకీయ సమీకరణాలు

ABP దేశం 2 weeks ago

హైదరాబాద్ రాజకీయాలు మళ్లీ ఒక ఆసక్తికర మారాయి. రోడ్లు, డ్రైనేజీలు, ట్రాఫిక్, మూసీ ప్రక్షాళన, చెరువుల ఆక్రమణలు వంటి పట్టణ సమస్యలపై జరగాల్సిన చర్చ నెమ్మదిగా ఐడెంటిటీ పాలిటిక్స్ వైపు మళ్లుతోందా?

ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు చూస్తే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి.

అమీర్పేట చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు చుట్టూ సాగిన చర్చ, తెలంగాణ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ - ఏపీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన మాటల యుద్ధం, సోషల్ మీడియాలో మళ్లీ తెరపైకి వచ్చిన తెలంగాణ-ఆంధ్ర భావోద్వేగాలు... ఇవన్నీ చూడటానికి విడివిడిగా కనిపించినా, GHMC ఎన్నికల కోనంలో చూస్తే ఒక పెద్ద రాజకీయ వ్యూహంలో భాగమే అని అనిపిస్తోంది.
ఎన్నికలు ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, రాజకీయ పార్టీలు ఇప్పటికే హైదరాబాద్ ఓటరు మనస్తత్వాన్ని అంచనా వేసే పనిలో పడ్డాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

రేపటి అధికారానికి GHMC ఎన్నికే తొలిమెట్టు..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పోరు GHMC ఎన్నికలే. రాష్ట్ర జనాభాలో కీలక భాగం హైదరాబాద్లో నివసిస్తోంది. రాష్ట్ర ఆదాయంలోనూ, రాజకీయ ప్రభావంలోనూ, మీడియా దృష్టిలోనూ హైదరాబాద్కు ప్రత్యేక స్థానం ఉంది.

హైదరాబాద్ను గెలుచుకోవడం అంటే కేవలం కార్పొరేషన్ను గెలుచుకోవడం కాదు. అది ఓ పొలిటికల్ నరేటివ్ ను సృష్టించడం. అందుకే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలూ GHMCని ప్రతిష్ఠాత్మక పోరుగా చూస్తున్నాయి.

గతంలో టీడీపీ బలంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్, తర్వాత బీఆర్ఎస్కు కోటగా మారింది. అదే జీహెచ్ఎంసీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారికి అనుకూలంగా మారింది. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే అందుకు నిదర్శనం. మరోవైపు బీజేపీ నగరంలో తన బలాన్ని క్రమంగా పెంచుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

NTR విగ్రహం: రెండు రాష్ట్రాల సెంటిమెంటు

తెలంగాణ ఉద్యమ కాలంలో తరచుగా వినిపించిన "తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వం" వాదనకు ఎదురుగా "తెలుగు జాతి ఉమ్మడి వారసత్వం" అనే వాదన మళ్లీ వినిపించింది. ఎన్టీఆర్ కేవలం ఆంధ్రప్రదేశ్ నాయకుడా? లేక మొత్తం తెలుగు జాతికి చెందిన నేతా? అనే చర్చలు కూడా జరిగాయి. తెలంగాణలో ఆంధ్ర పార్టీ నాయకుడి విగ్రహమెందుకని పాశం యాదగిరి లాంటి ఉద్యమకారులు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు తీవ్రచర్చకు దారి తీసింది. వాస్తవానికి ఎన్టీఆర్ ను తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్, బీఆరెస్ ఎవరూ బహిరంగంగా ఓన్ చేసుకోలేని పరిస్థితి. రేవంత్ మాత్రం తన ఓపెన్ గా తీసుకున్న నిర్ణయం ఇక్కడి సెటిలర్ ఓటర్లకు నచ్చుతుంది. అదే సమయంలో వ్యతిరేకులనూ ఆకట్టుకునే ప్రయత్నాలు ఇతర పార్టీలు చేయొచ్చు.

పవన్ కళ్యాణ్ - నాగేశ్వర్ వివాదం: సోషల్ మీడియా నుంచి రాజకీయ చర్చకు

ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన వివాదం కూడా తెలంగాణ-ఆంధ్ర చర్చను మరోసారి తెరమీదకు తెచ్చింది. తెంలగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మందుల సామేలు.. అనిరుధ్ రెడ్డిలు చేసిన వ్యాఖ్యలు, జనసేన అభిమానులు ప్రెస్ క్లబ్ లో చేసిన ప్రకటనలు పరిస్థితిని కాస్త ఉద్రిక్తంగానే మార్చాయి. కొందరు దీనిని తెలంగాణ మేధావి వర్గం వర్సెస్ ఆంధ్ర రాజకీయ ప్రభావం కోణంలో చూడగా, మరికొందరు పత్రికా స్వేచ్ఛ వర్సెస్ ఫ్యాన్ ఫేర్ అనే కోణంలో విశ్లేషించారు. ఈ వివాదం కొన్ని రోజులుగా సోషల్ మీడియా అజెండాను పూర్తిగా ఆక్రమించింది. ముఖ్యంగా యువతలో, రాజకీయంగా చురుకుగా ఉండే వర్గాల్లో ఈ చర్చ బలంగా సాగుతోంది.

మళ్లీ తెరపైకి వస్తున్న తెలంగాణ-ఆంధ్ర భావోద్వేగాలు?

తెలంగాణ ఆవిర్భావం తొలుత ఊహించినంత వైరం ఏమీ ఏర్పడలేదు పైగా ఏపీ పెట్టుబడిదారులు మాకు ముఖ్యం అని కేసీఆర్ స్వయంగా ప్రకచించారు కూడా . తర్వాత క్రమంగా అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగాలు, పెట్టుబడులు వంటి అంశాలు ప్రధాన చర్చగా మారాయి. కానీ ఇటీవల కొన్ని పరిణామాలు చూస్తే మళ్లీ ప్రాంతీయ సెంటిమెంటు ప్రధానాంశం కాబోతోందా అనికూడా అనిపించకమానదు. సోషల్ మీడియాలో తెలంగాణ వాదులు, ఆంధ్ర వాదులు అంటూ ఓపెన్ కాలింగ్ మొదలైంది. దాంతో ఇది ఎన్నికల ముందు సహజ రాజకీయ ప్రక్రియేనా? లేక పార్టీల వ్యూహాత్మక ప్రచారంలో భాగమా? అనుమానం కలగక మానదు.

GHMCలో సెట్లర్ ఓటు ఎంత కీలకం?

హైదరాబాద్ రాజకీయాల్లో "సెట్లర్ ఓటు" అనే పదం కొత్తది కాదు. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడిన లక్షలాది మంది ఓటర్లు నగర ఎన్నికల్లో ప్రభావం చూపే స్థాయిలో ఉన్నారు. ఈ వర్గం ఎటు మొగ్గుచూపితే అటే సీట్లు గెలుస్తారనేది గణాంకాలు చెప్తున్నాయి. ఐతే వీరు తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీవైపే మొగ్గుచూపుతారు అనే మరో విశ్లేషణ కూడా సాగుతోంది. 2009లో కాంగ్రేస్, 2018లో, 2023లో బీఆరెస్, ఇప్పుడు కాంగ్రెస్ వైపు హైదరాబాద్ ఓటరు మొగ్గుచూపడం ఆసక్తికర పరిణామం. అందుకే ఈ వర్గాన్ని ఆకర్షించగలిగితే నగరంలోని అనేక డివిజన్లలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయి. అందుకే ప్రతి పార్టీ ఈ వర్గాన్ని దూరం చేసుకునే ధైర్యం చేయదు.

తెలంగాణ అస్తిత్వ ఓటూ కీలకమే.. కాకపోతే జిల్లాల్లో..

మరోవైపు తెలంగాణ ఉద్యమం ద్వారా రాజకీయంగా చైతన్యం పొందిన వర్గాలు ఇప్పటికీ ఉన్నాయి. తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ చరిత్ర వంటి అంశాలను ప్రాధాన్యంగా చూసే ఓటర్లు కూడా నగరంలో ఉన్నారు. సెట్లర్లు అంటే కేవలం ఏపీ నుంచి వచ్చి స్థిరపడిన వారు మాత్రమే కాదు.. తెలంగాణ జిల్లాలనుంచి వచ్చిన వాళ్ళకూ ఇక్కడ గణనీయ ఓట్లున్నాయి. అందువల్ల GHMC ఎన్నికల్లో కేవలం సెట్లర్ ఓటు మాత్రమే కాదు, తెలంగాణ గుర్తింపు ఓటు కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

పార్టీల లెక్కలు ఇలా.. Congress vs BRS vs BJP

అధికార పార్టీగా కాంగ్రెస్ నగర అభివృద్ధిని ప్రధాన అజెండాగా తీసుకెళ్లే అవకాశం ఉంది. అదే సమయంలో సెట్లర్ వర్గాలకు దూరం కాదనే సంకేతాలను కూడా పంపే ప్రయత్నం చేయవచ్చు. అందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన బలం.. రేవంత్ కి ఉన్న తెలుగుదేశం నేపధ్యం, వ్యక్తిగత సంబందాలు ఆ పార్టీకి బలం కానున్నాయి.
బీజేపీ ఇప్పటికే నగరంలో బలమైన పట్టు సాధిస్తోంది.. హిందుత్వం, జాతీయతతో పాటు పవన్ కళ్యాణ్ చరిష్మా, తెలుగుదేశం పొత్తును అందుకు అనుకూలంగా వాడుకోబోతోంది. ప్రధాని ఇటీవలి హైదరాబాద్ పర్యటనలో చంద్రబాబు, పవన్ ల ఇంటికి వెళ్లడం, ప్రస్తుత తెలంగాణ - ఆంధ్ర సెంటిమెంటు ద్వారా బీఆరెస్ వ్యతిరేక వర్గాలను ఆకట్టుకునే వ్యూహంలో ఆపార్టీ వుండి.
బీఆర్ఎస్కు తెలంగాణ గుర్తింపు రాజకీయాలే సహజ బలం. తెలంగాణ ఉద్యమ వారసత్వాన్ని మళ్లీ ప్రజలకు గుర్తు చేస్తూ స్థానిక భావోద్వేగాలను తిరిగి చైతన్యపరిచే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అదే సమయంలో సెటిలర్లకు తాము వ్యతిరేకం కాదు అని చెప్పుకునే విషయంలో మాత్రం వారికి కత్తిమీద సాముగానే కనిపిస్తోంది. సెట్లర్ల ఓటు రేవంత్ - NDA కూటమి మధ్య చీలితే ఏదైనా లాభం వస్తుందేమో అనే ఆశల్లో కూడా ఆ పార్టీ ఉంది.

ప్రజాసమస్యలు వెనక్కుపోయినట్టేనా ..

రాబోయే GHMC ఎన్నికల్లో అసలు నరేటివ్ దేనిపై అన్న స్పష్టత మాత్రం ఇంకా రాలేదు.. మూసీ ప్రక్షాళన పై అభ్యంతరాలు, హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలు, వరదల నిర్వహణపై జరుగుతుందా? లేక తెలంగాణ అస్తిత్వం, ప్రాంతీయ భావోద్వేగాలపై జరుగుతుందా? అనేది తేలే కీలక దశలో మనమున్నాం. ఇప్పటివరకు జరిగిన పరిణామాలు చూస్తే రెండు అంశాలూ సమాంతరంగా నడుస్తున్నట్లు కనిపిస్తున్నాయి.

GHMC ఎన్నికలు అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా NTR విగ్రహం వివాదం, పవన్ కళ్యాణ్-నాగేశ్వర్ ఎపిసోడ్, సోషల్ మీడియాలో మళ్లీ వినిపిస్తున్న తెలంగాణ-ఆంధ్ర వాదనలు... ఇవన్నీ ఎన్నికల అజెండాను ప్రభావితం చేసే అంశాలుగా మారే అవకాశం ఉంది.

Author : Pradeep Kumar

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam