Dailyhunt
Telangana Congress: కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తికి అదే కారణమా? త్వరలోనే తీపి కబురు వింటారా?

Telangana Congress: కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తికి అదే కారణమా? త్వరలోనే తీపి కబురు వింటారా?

ABP దేశం 6 days ago

Telangana Congress: వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయనుందని వార్తలు వస్తున్నాయి.

అందులో భాగంగా మంత్రిమండలిని విస్తరించనున్నారని తెలుస్తోంది. అందుకే మంత్రిపదవి ఆశిస్తున్న నేతలంతా తమ స్వరాలను సవరించుకుంటున్నారు. మంత్రివర్గ రేసులోనే ఇతర కీలకమైన పదవుల జాబితాలో పేరు ఉండేలా అధిష్ఠానం దృష్టిలో పడేందుకు తెగ ఆయాస పడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ నుంచి విజయశాంతి, సంజయ్, ప్రేమ్సాగర్రావు, అనిరుద్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఈ తిరుగుబాటు లిస్ట్లో చేరుతున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డిపై కోపంతో జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. అదే బాటలో మరికొందరు ఉన్నారని ఆయన చెబుతున్నారు. మొత్తాన్ని మంత్రిపదవుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఇలాంటి ప్రయత్నాలు జరగడం కాంగ్రెస్లో సర్వసాధారణమైపోయింది.

నిప్పు పెట్టిన రాజగోపాల్ రెడ్డి

అసంతృప్తి బాంబుకు నిప్పు పెట్టింది మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నేరుగా రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. మొన్నటి వరకు ఆయన ఒక్కడే ఈ లిస్ట్లో ఉన్నాడని అనుకున్నారు కానీ, కాలం గడిచే కొద్దీ నాయకుల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. పదవుల ఆశ చూపి తనను బీజేపీ నుంచి రప్పించారని, ఇప్పుడు పదవులు ఇవ్వడం లేదని, నియోజకవర్గంలో అభివృద్ధికి డబ్బులు కూడా ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. చివరకు ఆయన ముఖ్యమంత్రి కుర్చీకే ఎసరు పెడతానంటూ గట్టిగానే చెప్పారు. ఇలా సమయం వచ్చినప్పుడల్లా అధికార పార్టీలో ప్రతిపక్షంలా రేవంత్ రెడ్డిని గుచ్చుతూనే ఉన్నారు. ఈ దఫా మంత్రివర్గంలో చోటు లభించకపోతే మాత్రం ఆయన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజగోపాల్ రెడ్డి సన్నిహితులు చెబుతున్నారు.

రాములమ్మ రగడ

తర్వాత స్థానంలోకి తాజాగా వచ్చారు రాములమ్మ విజయశాంతి. ఎమ్మెల్సీగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా కాలంగా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు వైలెంట్గా పెద్ద అస్త్రాన్నే పట్టుకొని వచ్చారు. ఆ విషయంపై ఇక్కడా అక్కడా మాట్లాడకుండా ఏకంగా మండలిలోనే లేవనెత్తారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీల పట్ల కాంగ్రెస్కు ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నించారు. వారికి ఇచ్చిన మాట ప్రకారం హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని నిలదీశారు. ఉద్యమకారుల సమస్యలను ప్రస్తావిస్తూనే తాను కూడా ఆశావహుల రేసులోకి వచ్చేశారు. ఆమెను సైలెంట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నరో లేదే తెలియదు కానీ వాటిపై దృష్టి పెట్టకుంటే మాత్రం వచ్చే ఎన్నికల నాటికి అదే పెద్ద ఇష్యూ కానుంది. లేకుంట్ వారి హామీలు అమలు చేస్తే విజయశాంతిని సైడ్ చేయవచ్చు. దీన్ని ఎలా డీల్ చేస్తారో చూడాలి.

ప్రేమగా ఫైర్ అయిన ప్రేమ్సాగ్

మరో సీనియర్ నేత ప్రేమ్సాగర్ కూడా సీనియర్లకు గౌరవం దక్కడం లేదనే పాయింట్పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సమక్షంలోనే విమర్శలు చేశారు. ఏ విషయంలో కూడా తమను పట్టించుకోవడం లేదని ఇది మంచి పద్ధతి కాదన్నారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేయొద్దని హెచ్చరించారు. పార్టీ ప్రగతిలో వారిదే కీలక పాత్ర అని సూచాయిగా చెప్పారు.

డీఎస్ కుమారుడి అసహనం

ఇప్పుడు ఇంకో సీనియర్ నేత కూడా తన గళాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. పార్టీని వీడిపోతానంటూ చెబుతున్నారు. ఆయనే డీఎస్ కుమారుడు డీ సంజయ్. డీఎస్కు ఇద్దరు కుమారులు. ఇందులో ఒకరు డీ అరవింద్కుమార్. ప్రస్తుత నిజమాబాద్ ఎంపీ. ఇంకో కుమారుడు సంజయ్. ఈయన గతంలో నిజామాబాద్ మేయర్గా పని చేశారు. పార్టీలో సీనియర్గా ఉన్న తనకు సరైన గుర్తింపు లేదని వాపోతున్నారు. అందుకే గౌరవం లేని చోట ఉండలేమంటూ శుక్రవారం మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. పార్టీ నేతలతో సమావేశమై తన దారి తాను చూసుకుంటానంటూ ప్రకటించారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్గా తీసుకోనట్టు కనిపిస్తోంది.

ఈ మధ్య వివాదాస్పద కామెంట్స్తో నిత్యం వార్తల్లో ఉంటున్న అనిరుద్ రెడ్డి కూడా ఈ జాబితాలో ఉన్నారని సమాచారం. అందుకే ఆయన చేస్తున్న కామెంట్స్ నేరుగా ప్రభుత్వంపై ప్రభావం చూపుతున్నాయి. కాంగ్రెస్కు కమిట్మెంట్తో పని చేస్తున్న వారిని పట్టించుకోవడం లేదని ఆయన అంటున్నారు. ఈయన మాత్రం తన మాటలతో మంటపుట్టిస్తూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసేలా చేస్తున్నారు.

సైలెంట్గాఉన్న జగ్గారెడ్డి

జగ్గారెడ్డి కూడా అప్పట్లో స్వరాన్ని సవరించుకొని మళ్లీ సైలెంట్ అయ్యారు. సరైన గుర్తింపు లభించలేదని అప్పట్లో విమర్సలు చేసిన ఆయన కొన్ని రోజులుగా తనపని తాను చేసుకొని వెళ్తున్నారు. మాస్ లీడర్గా పేరు ఉన్న ఆయన ఎలాంటి టర్న్ తీసుకుంటారో అన్న ఆసక్తి అనుచరులతోపాటు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది.

మంత్రివర్గం విస్తరణ ఆమడ దూరంలో ఉందని తెలుసుకునో లేదా వేరే అవకాశాలు ఎదురు చూస్తున్నాయనో చాలా మంది నేతలు తమ స్వరాలను సరి చేసుకుంటున్నారు. అందుకే అంసతృప్తితో ప్రభుత్వంపై, అధినాయకత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే చాలా కాలంగా అసంతృప్తితో విమర్శుల చేసీ చేసీ అలసిపోయిన జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. కారు ఎక్కేందుకు ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు పొలిటికల్ సర్కిల్లో ప్రచారం సాగుతోంది.

Author : Khagesh

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam