TTD Chairman BR Naidu | తిరుపతి: ఇటీవల కాలినడకన తిరుమలకు కొండపైకి వెళ్తున్న ఒక వందేళ్లు పైగా వయసున్న వృద్ధురాలి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
శ్రీవేంకటేశ్వర స్వామిపై ఆ 116 ఏళ్ల వృద్ధురాలికి ఉన్న అచంచలమైన భక్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు చలించిపోయారు. ఆ వృద్ధ భక్తురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా శ్రీవారి దర్శనం చేయించాలని టీటీడీ చైర్మన్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె వివరాలు తెలిస్తే తనకు తెలియజేయాలంటూ ఆయన సోషల్ మీడియా ఎక్స్ ద్వారా నెటిజన్లను విజ్ఞప్తి చేశారు.
రంగంలోకి విజిలెన్స్ అధికారులు – నవనీతమ్మగా గుర్తింపు
చైర్మన్ విజ్ఞప్తిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు తక్షణమే స్పందించి వివరాల కోసం ప్రయత్నించారు. ఆ వృద్ధురాలిని తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన నవనీతమ్మగా గుర్తించారు. చైర్మన్ ఆదేశాల మేరకు విజిలెన్స్ సిబ్బంది ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించి తిరుమల దర్శనానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు.

మధురై మీనాక్షి అమ్మవారు ఆకుపచ్చ రంగులో ఎందుకు దర్శనమిస్తారు?
శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం – మురిసిపోయిన కుటుంబ సభ్యులు
టీటీడీ చైర్మన్ నిర్ణయం ప్రకారం సోమవారం ఉదయం వృద్ధురాలైన నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు చైర్మన్ కార్యాలయ సిబ్బంది ప్రత్యేకంగా విఐపీ బ్రేక్ దర్శన భాగ్యాన్ని కల్పించారు. బయోమెట్రిక్ కౌంటర్ వద్ద సిబ్బంది దగ్గరుండి ఆమెను ఆలయంలోనికి తీసుకెళ్లారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర సమక్షంలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేశారు.
ఈఓ రవిచంద్ర స్వయంగా వృద్ధురాలికి పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలను అందజేశారు. అంతటితో ఆగకుండా ఆ శతాధిక వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా నవనీతమ్మ మనవడు దిక్పతీ మాట్లాడుతూ.. ‘ఆ శ్రీనివాసుడి రూపంలో టీటీడీ చైర్మన్ మా అమ్మమ్మకు, మా కుటుంబానికి ఇంతటి అద్భుతమైన దర్శన భాగ్యం కల్పించారు. టీటీడీకి, చైర్మన్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
Author : Shankar Dukanam

