Top MBBS Colleges: వైద్య వృత్తిని చేపట్టి సమాజానికి సేవ చేయాలనేది కోట్లాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల చిరకాల స్వప్నం. ఈ కలను సాకారం చేయకోవడానికి ఏటా నిర్వహించే నీట్ యూజీ పరీక్షల్లో లక్షల మంది పోటీ పడుతుంటారు.
అయితే కేవలం మంచి ర్యాంకు సాధిస్తే సరిపోదు. మీ ర్యాంకు, బడ్జెట్కు తగిన కాలేజీని ఎంచుకోవడమే అసలైన సవాలు. దేవ్యాప్తంగా ప్రభుత్వ కాలేజీల్లో ఫీజులు వేలల్లో ఉన్నప్పటికీ ప్రైవేటు, డీమ్డ్ వర్శిటీలలో కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల సౌకర్యం కోసం టాప్ మెడికల్ కాలేజీలు, వాటి ఫీజుల వివరాలు ఇక్కడ చూడవచ్చు.
దేశంలోనే టాప్ కాలేజీలు
భారత్లో అత్యున్నత ప్రమాణాలు కలిగిన వైద్య విద్యను ఆశించే విద్యార్థుల మొదటి ఎంపిక ఎల్లప్పుడూ కేంద్ర ప్రభుత్వ సంస్థలే. ఇక్కడ విద్యార్థులకు అద్భుతమైన క్లినికల్ ఎక్స్పోరజ్, తక్కువ ఫీజులతో నాణ్యమైన శిక్షణ లభిస్తుంది.
ఎయిమ్స్ న్యూఢిల్లీ
దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఈ కాలేజీలో సీటు సాధించాలంటే ీట్ టాప్ 50లో ర్యాంకు ఉండాలి. ఇక్కడ మొత్తం కోర్సు ఫీజు కేవలం 5, 356 రూపాయలు మాత్రమే.
జిప్మర్ పుదుచ్చేరి
మరొక అత్యుత్తమ సంస్థ ఇది. ఇక్కడ ఏడాదికి ఫీజు సుమారు 12వేల నుంచి 25వేల వరకు ఉంటుంది.
సీఎంసీ వెల్లూరు
ప్రైవేటు యాజమాన్యం అయినప్పటికీ విద్యా ప్రమాణాల్లో ఇది మేటి. ఏడాదికి ట్యూషన్ ఫీజు సుమారు 35వేల నుంచి 50 వేల వరకు ఉంటుంది.
మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ
ఢిల్లీ యూనివర్శిటీ పరిధిలోని ఈ ప్రభుత్వ కాలేజీలో వార్షిక ఫీజు కేవలం 2,500 నుంచి నాలుగు వేలు మాత్రమే ఉంటుంది.
తెలంగాణలో టాప్ వైద్య కాలేజీలు
తెలంగాణలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం, అడ్మిషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పలు ప్రతిష్టాత్మక కాలేజీలు ఉన్నాయి.
హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ, గాంధీ మెడికల్ కాలేజీలు అత్యున్నత క్లినికల్ అనుభవాన్ని అందిస్తాయి. వీటి వార్షిక ఫీజు కేవలం పదివేల నుంచి పదిహేను వేల మధ్య ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎయిమ్స్ బీబీనగర్లో మొత్తం కోర్సు ఫీజుల 5800 రూపాయలు మాత్రమే.
తెలంగాణలో ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు
తెలంగాణలోని ప్రైవేటు కాలేజీలలో మూడు రకాల ఫీజు స్ట్రక్చర్ ఉంటుంది. ఏ కేటగిరీలో ఏడాదికి 60వేల వరకు ఉంటుంది. బీ కేటగిరీలో ఏడాదికి 11,55,000 రూపాయలు చెల్లించాలి. ఇది మేనేజ్మెంట్ కోటా సీట్లు అన్నమాట. మూడోది సీ కేటగిరీ. ఇది ఎన్ఆర్ఐ కోటా. ఈ సీట్లకు 23,10,000 రూపాయుల చెల్లించాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్లో టాప్ మెడికల్ కాలేజీలు
ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. ఇక్కడ ప్రభుత్వ కాలేజీల్లో విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ టాప్లో ఉంటుంది. ఇక్కడ ఫీజు 11 వేల నుంచి 15 వేల మధ్య ఉంటుంది. గుంటూరు మెడికల్ కాలేజీలో వార్షిక ఫీజు సుమారు 10వే నుంచి 12వేల వరకు ఉంటుంది. ఎయిమ్స్ మంగళగిరిలో మొత్తం కోర్సు ఫీజు కేవలం 5,800 రూపాయలు మాత్రమే.
ప్రైవేటు కాలేజీ విషయానికి వస్తే ఏ కేటగిరీ సీటు ఫీజు ఏటా 15వేల నుంచి 16వేల మధ్య ఉంటుంది. బి-కేటగిరి ఫీజు 12 లక్షల నుంచి 13.50 లక్షల వరకు ఉంటుంది. ఎన్ఆర్ఐ కోటా భర్తీ చేసే సీ కేటగిరి సీట్లకు 24 లక్షల నుంచి 30 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తారు.
సీట్ల కేటగిరీల ఎలా డిసైడ్ చేస్తారు
ప్రైవేటు కాలేజీల్లో చేరే ముందు మూడు రకాల సీట్లపై అవగాహన ఉండటం మంచిది. రాష్ట్ర స్థాయిలో మెరిట్ ఆధారంగా ఏ కేటగిరీ సీట్లను 50 శాతం భర్తీ చేస్తారు. ఇక్కడ ఫీజులు తక్కువగా ఉంటాయి. తర్వాత బి కేటగిరీ కింద 35 శాతం సీట్లు భర్తీ చేస్తారు. నీట్ అర్హత సాధించిన ఏ రాష్ట్ర విద్యార్థులైనా ఇందులో పోటీ పడవచ్చు. వార్షిక ఫీజు 10 లక్షలకు పైనే ఉంటుంది. ఎన్ఆర్ఐ కోటాలో భర్తీ చేసేవి సీ కెటగిరీ సీట్లు. ఇందులో 15శాతం సీట్లు భర్తీ చేస్తారు. ఇవి చాలా ఖరీదైనవి.
కౌన్సెలింగ్ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు
కేవలం కాలేజీ పేరును చూసి కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. కాలేజీ ఎంచుకునేప్పుడు ఆసుపత్రికి వచ్చే డైలీ ఓపీ ఎంత ఉందో చూడటం చాలా ముఖ్యం. పేషెంట్లు ఎంత ఎక్కువ ఉంటే విద్యార్థులకు అంత మంచి ప్రాక్టిక్ నాలెడ్జ్ లభిస్తుంది. కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే కాకుండా హాస్టల్, మెస్, ల్యాబ్, డెవలప్మెంట్ ఫీజులు గురించి ముందే ఆరా తీయాలి. కొన్ని ప్రైవేటు కాలేజీలు బ్యాంకు గ్యారంటీలను కోరుతాయి. కాబట్టి రూల్స్ ముందే తెలుసుకోవాలి.
వైద్య విద్య అనేది చాలా ప్రయాసతో కూడుకున్నది. అందుకే కాలేజీ ఎంపిక నుంచి జాగ్రత్తగా అడుగులు వేయాలి. లేకుంటే కోర్సు పూర్తి అయ్యే సరికి భారీగా ఖర్చు అవుతుంది.
Author : Khagesh

