TVK Vijay Politics | చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విజయ్ పార్టీలో ఉత్సాహాన్ని నింపాయి. సోమవారం జరిగిన ఓట్ల లెక్కింపులో 108 సీట్లతో తమిళగ వెట్రి కళగం (TVK) సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది.
మరోవైపు అధికార పార్టీ అయిన డీఎంకే (DMK)కు దారుణ పరాభవం తప్పలేదు. డీఎంకే కూటమి 73 స్థానాలు, అన్నాడీఎంకే కూటమి 53 స్థానాల్లో విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన టీవీకే పార్టీ అధినేత గవర్నర్కు లేఖ రాశారు. తాము అధికారాన్ని ఏర్పాటు చేస్తామని, అందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని లేఖలో కోరినట్లు సమాచారం. మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విజయ్ తన ప్రయత్నాలు మొదలుపెట్టారు.
గవర్నర్కు టీవీకే అధినేత విజయ్ లేఖ
తమిళనాడు గవర్నర్ ప్రస్తుతం కేరళలో ఉన్నారని తెలుస్తోంది. ఈరోజు రాత్రి గవర్నర్ చెన్నైకి తిరిగి రానున్నారు. మరోవైపు తమిళనాడులో ఏ పార్టీ, కూటమి గానీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ సాధించలేదు. ఈ పరిస్థితుల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన టీవీకే అధినేత విజయ్ గవర్నర్ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు. టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని, 2 వారాల్లో ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టి మెజారిటీని నిరూపించుకుంటామని లేఖలో విజయ్ పేర్కొన్నారు.

