Udhayanidhi Stalin Bail: త్రిషపై అసభ్యంగా దూషించారనే కేసులో అరెస్టు అయిన డీఎంకే నాయకుడు, తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్కు హైకోర్టులో ఊరట లభించింది.
ఆయన్ని విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన కాసేపట్లో విడుదలైయ్యే ఛాన్స్ ఉంది.
కర్ణాటక, తమినాడు మధ్య నెలకొన్న కావేరీ జల వివాదంపై తంజావూరులో డీఎంకే నిరసన చేపట్టింది. ఇందులో ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. ఈ ఆందోళనలో మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి విజయ్ను టార్గెట్ చేసుకున్నారు. కావేరీ జలాలు రావాల్సినవి కూడా విజయ్ కారణంగా రాకుండా పోతున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి విజయ్పై విమర్శలు చేస్తున్న క్రమంలోనే ఆందోళనకారులు త్రిష, త్రిష అంటూ నినాదాలు చేశారు. అప్పుడే ఆయన అసభ్యకరమైన డబుల్ మీనింగ్ కామెంట్స్ చేశారు.
"ఆ నీరు వేరే చోటికి చేరినా చేరకపోయినా, కనీసం అక్కడికైనా చేరాలి" అని ఉదయనిధి అన్నారు. ఆ తర్వాత నవ్వి, తాను కావేరీ నది నీటి గురించి అలా అన్నానని కవర్ చేశారు. అయినా సరే దీనిపై టీవీకే శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడటం వారికి అలవాటుగా మారింది ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే వివిధ ప్రాంతాల్లో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ఫిర్యాదులు చేశారు. ఆయన్ని వెంటనే అరెస్టు చేయాలని లేదంటే రాష్ట్రంలోని మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపే ఛాన్స్ ఉందని తమ ఫిర్యాదుల్లో టీవీకే నేతలు తెలిపారు.
తంజావూరు ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఆయనపై ఎప్ఐర్ నమోదు చేశారు. ఈ ఉదయం ఆయన ఇంటికి వెళ్లి వివరాలు చెప్పారు. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు అరెస్టు చేస్తున్నామని వివరించారు. దీనికి కాస్త సమయం కావాలని ఆయన తరఫున న్యాయవాదులు, కుటుంబ సభ్యులు పోలీసులు రిక్వస్ట్ చేశారు. ఆయన్ని అరెస్టు చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న డీఎంకే శ్రేణులు భారీగా ఆయన నివాసానికి తరలి వచ్చారు.
మరోవైపు ఈ కేసుపై మద్రాస్ హైకోర్టులో ఉదయనిధి స్టాలిన్ తరఫున పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి చర్యలు చేపట్టకుండా ఊరట కల్పించాలని పిటిషన్లో వెల్లడించారు. దీనిపై అర్జెంట్గా విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. దీనిపై విచారణ చేపట్టేందుకు సమయం కావాలని అప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ అప్పటికే పోలీసులు ఉదయనిధి స్టాలిన్ ఇంటికి వెళ్లి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తంజావూరు స్టేషన్కు తరలించారు. అడ్డుకునేందుకు యత్నించిన డీఎంకే శ్రేణులను అదుపు చేశారు.
కోర్టులో ఉదయనిధి స్టాలిన్ పిటిషన్పై మద్రాస్ హైకోర్టు విచారించింది. అరెస్టు విషయాన్ని ఆయన తరఫున లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే కోర్టు జోక్యం చేసుకొని విడుదల చేయాలని ఆదేశించింది. పోలీసులు చేపట్టే విచారణకు సహకరించాలని ఉదయనిధి స్టాలిన్కు చెప్పింది. అయితే ఎఫ్ఐఆర్ నమోదు అయిన కేసులో విచారణ చేస్తున్నామని, అయిన వెంటనే విడుదల చేస్తామని పోలీసులు కోర్టుకు తెలియజేశారు.
కోర్టు ఆదేశాల మేరకు ఉదయనిధి విచారణ పూర్తి చేసుకున్న తర్వాత విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు ఆయనను అదుపులోకి తీసుకోవడంపై డీఎంకే శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దిష్టిబొమ్మలను తగులబెడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. త్రిష పేరు ప్రస్తావించకపోయినా రాజకీయ కక్షపూరితంగానే ఉదయనిధిని అరెస్టు చేశారని మండిపడుతున్నారు.
Author : Khagesh

