న్యూఢిల్లీ: గత కొంతకాలం నుంచి వివాదాల్లో చిక్కుకున్న భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మే 30 నుంచి జరగనున్న ఏషియన్ గేమ్స్ 2026 సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొనేందుకు మహిళా రెజ్లర్ వినేష్ ఫోగాట్కు ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది.
వినేష్ ఫోగాట్ వంటి మహిళా రెజ్లర్లను దూరం పెట్టడానికి మాతృత్వం (తల్లి కావడం) ఒక ప్రాతిపదిక కాకుండా చట్టం చూసుకుంటుందని న్యాయస్థానం పేర్కొంది. ఆసియా క్రీడలకు భారత రెజ్లింగ్ సమాఖ్య నిర్దేశించిన ప్రమాణాలు వివక్షపూరితంగా ఉన్నాయని ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఒక మహిళా రెజ్లర్ గర్భధారణ, ప్రసవానంతర కాలం నాటి ప్రయాణం అసాధారణమైన శారీరక సవాళ్లతో కూడి ఉంటుందనే విషయాన్ని తిరస్కరించలేమని హైకోర్టు పేర్కొంది. అయితే దీని తీవ్రతను క్రీడా రంగంలో తరచుగా గుర్తించరని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. వినేష్ ఫోగాట్ వంటి మహిళా అథ్లెట్లను దూరం పెట్టడానికి మాతృత్వం కారణం కాకూడదని న్యాయమూర్తి పేర్కొన్నారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య చర్య ద్వేషపూరితం
‘వినేష్ ఫోగాట్ ప్రసూతి సెలవులో ఉన్నందున భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మినహాయింపు సెలక్షన్ పాలసీని పూర్తి చేయలేకపోయారు. వినేష్ ఫోగాట్ వంటి మహిళా అథ్లెట్లను బహిష్కరించడానికి లేదా పక్కన పెట్టడానికి మాతృత్వం కారణం కాకూడదని’ ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. రెజ్లర్ వినేష్ ఫోగాట్కు WFI జారీ చేసిన షోకాజ్ నోటీసుపై కూడా ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
WFI చేపట్టిన ఈ చర్యను ద్వేషపూరితమైనదిగా కోర్టు అభివర్ణించింది. ఆమె విషయంలో పదాల ఎంపికపై సైతం కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. WFI వైపు నుంచి దురుద్దేశం ఉందని స్పష్టంగా అర్థమవుతోందని కోర్టు వ్యాఖ్యానించడం హాట్ టాపిక అవుతోంది. 2025లో మెడల్స్ గెలిచిన వారికే అర్హతను పరిమితం చేసేలా నిబంధనలు ఉన్నాయని ధర్మాసనం తప్పుపట్టింది.
Author : Shankar Dukanam

