West Bengal Latest News: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి హింసాత్మక మలుపు తిరిగాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలు సమయం దగ్గరపడుతున్న వేళ, మాల్దా జిల్లాలో చోటు చేసుకున్న దిగ్భ్రాంతికర ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా తమ పేర్లు తొలగించారన్న ఆగ్రహంతో ఒక వర్గం ప్రజలు ఏడుగురు జుడిషియల్ అధికారులను తొమ్మిది గంటలపాటు బందీలుగా ఉంచారు. ఈ ఘటనపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సీరియస్ అయ్యారు.
బుధవారం సాయంత్ర మొదలైన హైడ్రామా అర్థరాత్రి వరకు కొనసాగింది. చివరకు అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటి గంట ప్రాంతంలో భారీ పోలీసు బలగాలు, పారా మిలటరీ దళాలు రంగంలోకి దిగి అధికారులను సురక్షితంగా అక్కడి నుంచి తరలించాయి. అయితే తరలింపు సమయంలో నిరసనకారులు అధికారుల వాహనాలపై రాళ్లతో దాడి చేయడమే కాకుండా కర్రలతో దాడులు చేసే ప్రయత్నం చేశారు. వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు.
సుప్రీం కోర్టు ఆగ్రహం
ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని అర్ధరాత్రి 2 గంటల వరకు పర్యవేక్షించినట్టు వెల్లడించారు. ఇది కేవలం ఒక సాధారణ ఘటన కాదు, జుడిషియల్ అధికారుల మనోధైర్యం దెబ్బ తీసేందుకు, కోర్టు ఆదేశాల అమలును అడ్డుకునేందుకు చేసిన పథకం ప్రకారం జరిగిన కుట్రలా కనిపిస్తోంది అని ఆయన కామెంట్ చేశారు.
ప్రభుత్వం పెయిల్ అయిందన్న సీజేఐ
బెంగాల్ చాలా పోలరైజ్డ్ రాష్ట్మని అక్కడ అందరూ రాజకీయ భాషలోనే మాట్లాడుతున్నారని సీజేఐ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయాధికారుల రక్షణలో విఫలైన రాష్ట్రప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బాధ్యతారాహిత్యంగా పేర్కొన్నారు.
ఘటనపై లోతైన దర్యాప్తునకు ఆదేశం
ఈ ఘటనపై లోతైన విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సాధారణ పోలీసుల విచారణపై నమ్మకం లేదని, సీబీఐ లేదా జాతీయ దర్యాప్తు సంస్థ NIAతో విచారణ జరిపించాలని కేంద్ర ఎన్నిక సంఘాన్ని కోర్టు ఆదేశించింది. దర్యాప్తు సంస్థ నేరుగా సుప్రీం కోర్టుకు ప్రాథమిక నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.
రిప్రజంటేషన్స్ ఇవ్వడానికి కఠిన రూల్స్
అంతేకాకుండా, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి కఠిన నిబంధనలు విధించింది. అధికారుల వద్దకు అభ్యంతరాలు తెలపడానికి ఒకేసారి ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల కంటే ఎక్కువ మందిని అనుమతించకూడదని పేర్కొంది. విచారణ జరుగుతున్న ప్రాంతంలో ఐదుగురు కంటే ఎక్కువమంది గుమిగూడకుండా చర్యలు తీసుకోనున్నారు. అధికారుల భద్రతు హోమ్ సెక్రటరీ, డీజీపీ, జిల్లా మేజిస్ట్రేట్ వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుంది.
శాంతి భద్రతలు తన చేతిలో లేవన్న మమత
మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటనపై స్పందించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేవని పేర్కొన్నారు. యంత్రాంగమంతా ఎన్నికల సంఘం పర్యవేక్షణలోనే ఉందని, తన అధికారులను కూడా మార్చేశారని ఆమె వివరణ ఇచ్చారు.
Author : Khagesh

