Govt Plans Special 3 Day Parliament Session: కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేసేందుకు ఏప్రిల్ 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది.
2023లో ఆమోదం పొందిన ఈ చట్టం.. కొత్త జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే అమల్లోకి వస్తుందని గతంలో పేర్కొన్నారు. అయితే, తాజా సవరణల ద్వారా ఈ నిబంధనలను సడలించి, 2029 సార్వత్రిక ఎన్నికల నాటికే 33 శాతం మహిళా కోటాను అమలు చేయాలన్నది ప్రభుత్వ ప్రధాన వ్యూహం.
ఈ ప్రత్యేక సెషన్లో ప్రవేశపెట్టబోయే ప్రతిపాదనల్లో అత్యంత కీలకమైనది లోక్సభ స్థానాల పెంపు . ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను 816కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల పెరిగిన స్థానాల్లో సుమారు 273 సీట్లను మొత్తం స్థానాల్లో మూడో వంతు మహిళలకు కేటాయించే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల ప్రస్తుతం ఉన్న పురుష ఎంపీల ప్రాతినిధ్యానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అదనపు స్థానాల ద్వారా మహిళా రిజర్వేషన్లను అమలు చేయవచ్చని కేంద్రం భావిస్తోంది. ఇదే తరహా మార్పులను రాష్ట్ర అసెంబ్లీల్లో కూడా ప్రవేశపెట్టనున్నారు.
అమలు ప్రక్రియలో ఉన్న ప్రధాన అడ్డంకిని తొలగించేందుకు ప్రభుత్వం ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. కొత్త జనగణన కోసం వేచి చూడకుండా, 2011 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు వీలుగా డీలిమిటేషన్ చట్టాన్ని సవరించనున్నారు. దీనివల్ల జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య తగ్గకుండా, అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపు 50 శాతం మేర సీట్లు పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఒక రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు సాధారణ బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టనున్నారు.
ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలు, సందేహాలను నివృత్తి చేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే పలువురు విపక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఈ హడావుడి చేస్తోందని కాంగ్రెస్ వంటి పార్టీలు విమర్శిస్తున్నప్పటికీ, మహిళా సాధికారత విషయంలో వెనక్కి తగ్గకూడదని కేంద్రం గట్టి పట్టుదలతో ఉంది. ఈ ప్రత్యేక సమావేశాలు విజయవంతమైతే, భారత పార్లమెంట్ చరిత్రలో మహిళల ప్రాతినిధ్యం అత్యున్నత స్థాయికి చేరుకోవడం ఖాయం.
Author : Raja Sekhar Allu

