Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
YS Jagan  On TET Exam:  టీచర్ల  టెట్  నిబంధనలపై జగన్ ఫైర్! చంద్రబాబు తీరుపై మండిపడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత ఘాటు ట్వీట్!

YS Jagan On TET Exam: టీచర్ల టెట్ నిబంధనలపై జగన్ ఫైర్! చంద్రబాబు తీరుపై మండిపడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత ఘాటు ట్వీట్!

ABP దేశం 1 week ago

AP Teacher Promotions TET 60 Percent Marks Issue: ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల ప్రమోషన్లు, ఉద్యోగ భద్రతకు గుదిబండగా మారిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిబంధనలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ వేదికగా ఆయన ఒక సుదీర్ఘమైన, ఘాటు లేఖను సంధించారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా విద్యాబోధన చేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులు టెట్ నిబంధనల వల్ల అనుభవిస్తున్న మానసిక క్షోభను, ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం దారుణమని జగన్ మండిపడ్డారు. ఈ నిబంధనల వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మందికి పైగా ఉపాధ్యాయుల భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

టెట్ కంటే ముందే ఉద్యోగం పొందిన టీచర్లు

వైఎస్ జగన్ తన ట్వీట్లో ఉపాధ్యాయుల పక్షాన అత్యంత లాజికల్ పాయింట్లను లేవనెత్తారు. "2011 కంటే ముందు నుంచి ఉపాధ్యాయులుగా చేరి, ఇప్పటికీ సేవలు అందిస్తున్న వారు కూడా ఇప్పుడు టెట్ పరీక్ష పాస్ కావాలని నిబంధన పెట్టడం ఏమాత్రం సమంజసం కాదు. 20 నుంచి 25 ఏళ్లకు పైబడి ఒక నిర్దిష్ట సబ్జెక్ట్ టీచర్లుగా కొనసాగుతున్న సీనియర్లను.. ఇప్పుడు అకస్మాత్తుగా అన్ని సబ్జెక్టుల సిలబస్తో కూడిన టెట్ పరీక్ష రాయమనడం, అందులోనూ గరిష్టంగా 60 శాతం మార్కులు సాధించాలని రూల్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్?" అని జగన్ చంద్రబాబును నిలదీశారు. వీరంతా అప్పట్లోనే అత్యంత కఠినమైన డీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి, మెరిట్ సాధించాకే ఉద్యోగాల్లోకి వచ్చారన్న నిజాన్ని ప్రభుత్వం ఎలా మరుస్తుందని ఆయన ప్రశ్నించారు.

చట్టం రాకముందే ఉద్యోగాలు

జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం 2011 నుంచి టీచర్ ఉద్యోగాలకు టెట్ను తప్పనిసరి చేశారు. అయితే, ఈ చట్టం రాకముందు నుంచే, అంటే అసలు టెట్ అనే పరీక్షే లేని కాలం నాటి నుంచి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ఈ నిబంధనను బలవంతంగా రుద్దడం చట్టవిరుద్ధమని జగన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలవుతున్న టెట్ కండిషన్ల కారణంగా ఉపాధ్యాయులకు కేవలం ప్రమోషన్ల సమస్యే కాకుండా, చివరకు వారి దశాబ్దాల ఉద్యోగ భద్రతకే ముప్పు వాటిల్లుతోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం పరీక్షల ఒత్తిడితో టీచర్లను మానసిక ఆందోళనకు గురిచేస్తుండటం వల్ల విద్యావ్యవస్థపై ఆ ప్రభావం పడుతుందన్నారు. ఉపాధ్యాయుల వాదనలో వంద శాతం న్యాయం ఉన్నప్పటికీ, సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఈ నిరుపేద, మధ్యతరగతి ఉద్యోగుల ఆర్తనాదాలను బేఖాతరు చేస్తున్నారని, వారి సమస్యలను పరిష్కరించాలనే కనీస ధ్యాస కూడా సీఎంకు లేకపోవడం అన్యాయమని జగన్ విమర్శించారు.

అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్

ఈ వివాదాస్పద టెట్ నిబంధన నుంచి సీనియర్ ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించేందుకు వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వానికి ఒక స్పష్టమైన డిమాండ్ పెట్టారు. కేంద్ర విద్యాహక్కు చట్టంలో సవరణలు కోరుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తక్షణమే ఒక తీర్మానాన్ని ఆమోదించి, దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు. 2011కు ముందు సర్వీసులోకి వచ్చిన ఉపాధ్యాయులందరికీ టెట్ పరీక్ష రాయడం నుంచి శాశ్వత మినహాయింపు ఇచ్చేలా కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తీసుకురావాలని, ఉపాధ్యాయులకు తక్షణ ఉపశమనం కలిగించాలని జగన్ గట్టిగా కోరారు. వారు కాంపిటేటివ్ పరీక్షలు పాస్ అయి వచ్చినవారేనన్న సంగతిని మళ్లీ గుర్తుచేస్తూ.. టీచర్ల పోరాటానికి తమ పార్టీ అండగా ఉంటుందని జగన్ స్పష్టం చేశారు.

Author : Raja Sekhar Allu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam