కన్నప్రేమ కరువైంది.. మానవత్వం మంటగలిసింది. నవమాసాలు మోసి, రెక్కలముక్కలు చేసుకుని పెంచిన తల్లిదండ్రులనే ఆస్తి కోసం కొడుకు, మనవళ్లు కలిసి విచక్షణారహితంగా దాడి చేసిన హేయమైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని కొత్తాట గ్రామంలో ఓ వృద్ధ దంపతులు నివాసముంటున్నారు. వారికున్న ఆస్తిపై కన్నేసిన కొడుకు, మనవళ్లు.. ఆ ఆస్తిని తమ పేరిట రాయాలంటూ గత కొంతకాలంగా సదరు వృద్ధ దంపతులపై ఒత్తిడి తెస్తున్నారు. దానికి వారు నిరాకరించడంతో, లొంగదీసుకోవడానికి దారుణమైన మార్గాన్ని ఎంచుకున్నారు.
ఆస్తి వివాదం ముదరడంతో కొడుకు, మనవళ్లు కలిసి వృద్ధ తల్లిదండ్రులపై విచక్షణారహితంగా దాడికి దిగారు. వయసు మళ్లిన వారనే జాలి కూడా లేకుండా కాళ్లతో తన్నుతూ, తీవ్రంగా కొడుతూ వారిని చిత్రహింసలకు గురిచేశారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ వృద్ధ దంపతులు తమ కన్నకొడుకే కాలయముడిగా మారి చేస్తున్న దాడిని తట్టుకోలేక కన్నీరుమున్నీరయ్యారు.
వృద్ధులపై జరిగిన ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులైన కొడుకు, మనవళ్లపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
