పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారి తన రెండో క్యాబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మతపరమైన ఆర్థిక సహాయ పథకాలను నిలిపివేస్తూ, మహిళా సంక్షేమం కోసం భారీ పథకాలను ప్రకటించారు.
మదర్సా శాఖ మరియు సమాచార-సాంస్కృతిక శాఖల కింద అమలవుతున్న మతపరమైన ఆర్థిక సహాయ పథకాలను దశలవారీగా నిలిపివేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. గత ప్రభుత్వం 2012లో ఇమామ్లకు (రూ. 3,000), 2020లో హిందూ పూజారులకు (రూ. 2,000) స్టైపెండ్ పథకాలను ప్రారంభించింది.ఈ కొనసాగుతున్న ప్రాజెక్టులు ఈ నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి, ఆ తర్వాత పూర్తిగా నిలిపివేయబడతాయి.
బీజేపీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా 'అన్నపూర్ణ యోజన'ను క్యాబినెట్ ఆమోదించింది. ఈ పథకం కింద జూన్ 1 నుండి మహిళలకు నెలకు రూ. 3,000 ఆర్థిక సహాయం అందుతుంది.ఇప్పటికే 'లక్ష్మీ భండార్' పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న మహిళలు స్వయంచాలకంగా ఇందులో భాగమవుతారు. మిగిలిన వారికోసం కొత్త పోర్టల్ను ప్రారంభించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జూన్ 1 నుండి మహిళలందరికీ ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ముఖ్యమంత్రి సువేందు అధికారి సోమవారం సాల్ట్ లేక్లోని బీజేపీ కార్యాలయంలో తన మొదటి 'జనతా దర్బార్' నిర్వహించారు.ప్రజల విన్నపాలు, ఫిర్యాదులను స్వయంగా వినేందుకు ఈ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.విద్యార్థులతో సహా అనేకమంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరహాలో, సువేందు అధికారి కూడా తన పదవీ కాలంలో క్రమం తప్పకుండా ఇలాంటి ప్రజా ఫిర్యాదుల సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ ఈ పరిణామాలపై స్పందిస్తూ.. గత 15 ఏళ్లలో టీఎంసీ చేయలేని పనులను, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కేవలం మొదటి వారంలోనే చేసి చూపిస్తోంది అని సోషల్ మీడియా (X) వేదికగా పేర్కొంది. సువేందు అధికారి మే 9న పశ్చిమ బెంగాల్ మొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
