దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెంపుపై వస్తున్న విమర్శలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తోసిపుచ్చారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ పెంపు అనివార్యమైందని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు సరఫరాలో ఏర్పడిన అంతరాయం మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు పెరిగాయని రిజిజు వివరించారు.
భారతదేశంలో ధరల పెంపును విమర్శించే వారు ఇతర దేశాల పరిస్థితిని గమనించాలి. అనేక దేశాల్లో ఇంధన ధరలు 20 శాతం నుండి ఏకంగా 100 శాతం వరకు పెరిగాయి. వాటితో పోలిస్తే భారత్లో పెంపు చాలా తక్కువగా ఉంది అని అన్నారు. సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, అయితే అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం నుండి పూర్తిగా తప్పించుకోవడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకోవాలని కోరారు.
శుక్రవారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ. 3 మేర ధర పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండగా, ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు వివరణ ఇస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో దేశాన్ని సుస్థిరంగా ఉంచేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదని మంత్రి స్పష్టం చేశారు.
