ఒకప్పుడు సిద్ధంగా ఉన్న హంటావైరస్ వ్యాక్సిన్ మరియు చికిత్సకు సంబంధించిన పరిశోధనలు, నిధుల కొరత కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అర్జెంటీనా నుండి యూరప్ వైపు ప్రయాణిస్తున్న ఒక క్రూయిజ్ షిప్లో తాజాగా ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందడంతో, శాస్త్రవేత్తలు మరోసారి అప్రమత్తమయ్యారు.
సాధారణంగా హంటావైరస్ ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. అయితే, చిలీలో వెలుగుచూసిన 'ఆండీస్' (Andes) వేరియంట్ మాత్రం మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే ఏకైక రకం. ఇది తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులకు దారితీస్తుంది మరియు దీని మరణాల రేటు దాదాపు 40 శాతంగా ఉంది.
చిలీలోని యూనివర్సిడాడ్ డి కన్సెప్షన్ శాస్త్రవేత్త మరియా జోస్ బార్రియా నేతృత్వంలోని బృందం 2016 నుంచే దీనిపై పరిశోధనలు చేస్తోంది. జంతువులపై జరిపిన ప్రయోగాల్లో ఒక మోనోక్లోనల్ యాంటీబాడీ ఊపిరితిత్తులలోని ఇన్ఫెక్షన్ను పూర్తిగా తొలగించినట్లు గుర్తించారు. 2021లో ఈ యాంటీబాడీకి అమెరికాకు చెందిన FDA 'ఆర్ఫన్ డ్రగ్' హోదాను కూడా ఇచ్చింది.
పరిశోధనలు మానవ ప్రయోగాల (Human Trials) స్థాయికి చేరుకున్న తరుణంలో నిధుల కొరత ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగాలంటే కనీసం 7 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 58 కోట్లు) అవసరమని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా నిధులన్నీ కరోనా వ్యాక్సిన్ల వైపు మళ్లడంతో హంటావైరస్ పరిశోధనలు మూలన పడ్డాయి. ప్రస్తుతం నిధులు అందుబాటులోకి వచ్చినా, పాత స్థితికి చేరుకోవడానికి మరో 12 నుండి 24 నెలల సమయం పడుతుందని బార్రియా పేర్కొన్నారు.
