కరీంనగర్లో సంచలనం సృష్టించిన పీఎంజే (PMJ) జ్యువెలరీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన కరీంనగర్ పోలీసులు.. ఇతర రాష్ట్రాల్లో మాటువేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
మే 3వ తేదీన పట్టపగలే కాల్పులు జరిపి సినిమా ఫక్కీలో జరిగిన ఈ దోపిడీ ఉదంతంలో ముగ్గురు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మే 3వ తేదీన కరీంనగర్ జ్యోతినగర్లోని పీఎంజే (PMJ) జ్యువెలరీ షాపులోకి చొరబడిన దుండగులు, అక్కడి సిబ్బందిని తుపాకులతో బెదిరించి కాల్పులు జరిపారు. భారీగా బంగారు ఆభరణాలను దోచుకుని బైకులపై పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
దోపిడీ అనంతరం నిందితులు బైకులపై మహారాష్ట్ర మీదుగా బెంగాల్కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ మరియు టెక్నికల్ డేటా ఆధారంగా రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు బీహార్ మరియు పశ్చిమ బెంగాల్లో గాలింపు చేపట్టి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి దోచుకెళ్లిన భారీ మొత్తంలో బంగారు ఆభరణాలతో పాటు, నేరానికి ఉపయోగించిన తుపాకులు, వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ భారీ దోపిడీలో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా మొత్తం 13 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా పక్కా ప్లాన్ ప్రకారమే ఈ నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ముఠాకు నాయకత్వం వహించిన అంతర్రాష్ట్ర నేరగాడు సుబోధ్ సింగ్ ఇంకా పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సుబోధ్ సింగ్ కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పట్టుబడిన నిందితులను విచారించడం ద్వారా ఈ ముఠా గతంలో దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ దోపిడీలకు పాల్పడిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
