దేశవ్యాప్తంగా ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) తీపి కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
సాధారణంగా జూన్ 1న కేరళలోకి ప్రవేశించే రుతుపవనాలు, ఈసారి నాలుగు రోజుల ముందే అంటే మే 26వ తేదీనే వచ్చే అవకాశం ఉందని IMD నివేదిక తెలిపింది.
దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలో రుతుపవనాల కదలికకు అనుకూలమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇవి మే 19 నాటికే ఆయా ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది.
గత 19 ఏళ్లలో IMD వేసిన అంచనాలు (2015 మినహా) దాదాపుగా నిజమయ్యాయి. రుతుపవనాల రాక తేదీలో ప్లస్ లేదా మైనస్ నాలుగు రోజుల వ్యత్యాసం ఉండవచ్చని అధికారులు పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయ రంగం ప్రధానంగా ఈ వర్షాలపైనే ఆధారపడి ఉంటుంది. రుతుపవనాలు ముందస్తుగా రావడం వల్ల ఖరీఫ్ సాగు పనులు వేగవంతం అవుతాయని, ఇది రైతులకు సానుకూల అంశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కేరళను తాకిన తర్వాత రుతుపవనాలు క్రమంగా ఉత్తర దిశగా ప్రయాణించి, జూన్ మొదటి లేదా రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.
