హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనల విషయంలో ఒక అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే కారుపై ఏకంగా 95 ట్రాఫిక్ చలాన్లు నమోదవడం నగరవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
పోలదాస్ సురేష్కు చెందిన ఈ కారుపై సుమారు రూ.36,600 జరిమానా పెండింగ్లో ఉన్నట్లు ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు. వివిధ రకాల ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల కారణంగా ఈ చలాన్లు నమోదు చేసినట్లు సమాచారం.
ట్రాఫిక్ పోలీసులు పలుమార్లు నోటీసులు పంపినప్పటికీ, కారు యజమాని స్పందించకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. జరిమానాలు చెల్లించకుండా వాహనం వినియోగించడం కొనసాగించాడని వెల్లడించారు.ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు చర్యలకు దిగారు. ప్రత్యేకంగా నిర్వహించిన తనిఖీల్లో ఆ కారును గుర్తించి సీజ్ చేశారు. దీంతో పెండింగ్లో ఉన్న చలాన్లపై కఠిన చర్యలు తీసుకునే దిశగా అధికారులు ముందుకు వెళ్లారు.
ఈ ఘటనను ఉదాహరణగా తీసుకొని ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు హెచ్చరిక జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, చలాన్లను సమయానికి చెల్లించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. లేదంటే ఇలాంటి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలను నిర్లక్ష్యం చేయడం కేవలం జరిమానాలకు మాత్రమే కాకుండా, భద్రతకు కూడా ప్రమాదమని అధికారులు గుర్తు చేస్తున్నారు.

