పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీవ్రమైన శిక్ష విధించింది.
నిందితుడికి 20 సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
పోలీసులు మరియు ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని మీర్పేట్ ప్రాంతానికి చెందిన సంపంగి శివ అనే వ్యక్తి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వరుసకు బంధువైన ఒక 15 ఏళ్ల మైనర్ బాలికను అతను ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, ఆమెపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి, మీర్పేట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు సంపంగి శివపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. విచారణలో భాగంగా పోలీసులు బాధితురాలైన మైనర్ బాలిక వాగ్మూలాన్ని రికార్డ్ చేశారు. అనంతరం ఈ కేసును పోక్సో (POCSO) చట్టం కింద నమోదు చేసి, కోర్టులో పక్కా ఆధారాలతో కూడిన చార్జీషీట్ను దాఖలు చేశారు.
రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిగింది. నిందితుడిపై మోపబడిన నేరారోపణలు నిరూపితం కావడంతో, న్యాయమూర్తి నిందితుడు సంపంగి శివకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. మైనర్లపై జరిగే నేరాలకు ఇటువంటి కఠిన శిక్షలు పడటం వల్ల సమాజంలో నేరస్థులకు గట్టి హెచ్చరిక వెళ్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
