సమాజంలో నమ్మక ద్రోహానికి, మానవత్వానికే మచ్చ తెచ్చేలాంటి దారుణ ఘటన మేడ్చల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తల్లితో సహజీవనం చేస్తూ ఆమె మైనర్ కుమార్తెపైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ దుర్మార్గుడు.
మేడ్చల్ జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారంలో అత్యంత హేయమైన ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళతో నమ్మకంగా సహజీవనం చేస్తున్న వ్యక్తి, ఆమె నమ్మకాన్ని వమ్ము చేస్తూ 15 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి ఒడిగట్టిన దుర్గాప్రసాద్ (34) అనే నిందితుడిని అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. మచ్చ బొల్లారం పరిధిలో నివాసముంటున్న ఒక మహిళతో నిందితుడు దుర్గాప్రసాద్ గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి దుర్గాప్రసాద్ కామవాంఛతో 15 ఏళ్ల మైనర్ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బాలికను బెదిరించాడు.
జరిగిన దారుణాన్ని భరించలేకపోయిన సదరు బాలిక, చివరకు ధైర్యం చేసి తన తల్లికి అసలు విషయం చెప్పింది. ప్రాణం కంటే మిన్నగా నమ్మిన వ్యక్తి తన బిడ్డ జీవితాన్ని ఇలా బుగ్గిపాలు చేయడంతో సదరు తల్లి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. అల్వాల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి నిందితుడిపై ఫిర్యాదు చేసింది.
బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అల్వాల్ పోలీసులు తక్షణమే స్పందించారు. నిందితుడు దుర్గాప్రసాద్పై మైనర్లపై జరిగే లైంగిక నేరాల నిరోధక చట్టం (POCSO Act) తో పాటు ఐపీసీలోని పలు కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కేసు నమోదు చేసిన కొద్ది గంటల్లోనే నిందితుడు దుర్గాప్రసాద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ప్రాథమిక దర్యాప్తును పూర్తి చేసిన అనంతరం నిందితుడిని కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
