ఏడాదిన్నరగా నిలిచిపోయిన శ్రీవారి
వెండి, బంగారు డాలర్ల విక్రయాలు
తిరుమల, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): టీటీడీ అధికారుల నిర్లక్ష్యం పుణ్యమా.. సామాన్య భక్తులు అధికంగా కొనుగోలు చేసే 2 గ్రాముల తిరుమల శ్రీవారి బంగారు, వెండి డాలర్ల విక్రయాలు ఏడాదిన్నర కాలంగా నిలిచిపోయాయి. దీనిపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి చిత్రాలతో ఉండే బంగారు, వెండి డాలర్లను కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. 40 ఏళ్లుగా 10, 5, 2 గ్రాముల బంగారు డాలర్లతో పాటు 50, 10, 3 గ్రాముల వెండి డాలర్లను టీటీడీ విక్రయిస్తోంది. వీటిలో 70 శాతం 2గ్రాముల బంగారు, వెండి డాలర్లనే భక్తులు కొనుగోలు చేస్తుంటారు.
సాధారణ రోజుల్లో రూ.5 నుంచి రూ.6 లక్షల దాకా విక్రయాలు జరుగుతుంటాయి. అయితే 2019 నవంబరు నుంచి రూ.10 వేల లోపు ధర కలిగిన 2 గ్రాముల బంగారు డాలర్లతో పాటు తక్కువ ధర కలిగిన వెండి డాలర్ల విక్రయాలు నిలిపివేశారు. ప్రస్తుతం రూ.25 వేల ధరతో 5 గ్రాములు, రూ.50 వేల ధరతో 10 గ్రాముల బంగారు డాలర్ల విక్రయాలు మాత్రమే జరుగుతున్నాయి. రూ.700లోపు ధర ఉండే 10, 5 గ్రాముల వెండి డాలర్ల కోసం వచ్చే భక్తులు కూడా తమకు అదృష్టం లేదనుకుంటూ టీటీడీ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. కొందరు భక్తులు ఇటీవల డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమంలో విన్నవించినా స్పందన రాలేదు. సామాన్యుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని టీటీడీ 2 గ్రాముల బంగారు, వెండి డాలర్లను అందుబాటులో ఉంచాలని భక్తులు కోరుతున్నారు.

