Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
748 మంది ఉద్యోగులకు 'పాజిటివ్‌'

748 మంది ఉద్యోగులకు 'పాజిటివ్‌'

తిరుపతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ఆదాయం కోసమే తిరుమల శ్రీవారి దర్శనాలు చేయిస్తున్నామన్న విమర్శల్లో వాస్తవం లేదని, భక్తుల అభీష్టం మేరకు కొవిడ్‌ నిబంధనలను అనుసరించి పరిమిత సంఖ్యలో దర్శనాలు కల్పిస్తున్నామని టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ అన్నారు. వాస్తవానికి కరోనా నేపథ్యంలో ఆదాయం కన్నా ఖర్చే ఎక్కువవుతోందని స్పష్టంచేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఆదివారం ఉదయం ఆయన 'డయల్‌ యువర్‌ ఈవో' కార్యక్రమంలో పాల్గొని భక్తుల సూచనలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కరోనా కేసుల పెరుగుదలతో కొద్ది రోజులుగా తిరుమలలో దర్శనాలు చేసుకునేవారి సంఖ్య తగ్గిందన్నారు. ఇప్పటివరకు 748మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, వీరిలో ఇప్పటికే 405మంది కోలుకున్నారని తెలిపారు.

ఇంకా 338 మంది చికిత్స తీసుకుంటుండగా ముగ్గురు మృతి చెందారన్నారు. ఎస్వీబీసీ చానల్‌ నిర్వహణకు ఏడాదికి రూ.3నుంచి 4కోట్లు ఖర్చవుతోందని, అయినప్పటికీ.. త్వరలో యాడ్‌ ఫ్రీ చానల్‌గా, హెచ్‌డీ చానల్‌గా మారుస్తున్నామని చెప్పారు. హిందీ, కన్నడ భాషల్లో కూడా ఎస్వీబీసీ ప్రసారాలను ప్రారంభిస్తామన్నారు. త్వరలోనే తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శ్రీమద్భగవద్గీత, గరుడపురాణ పారాయణాలను ప్రత్యక్షప్రసారం చేస్తామన్నారు. జూలైలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.16కోట్లు కాగా ఈ-హుండీ ద్వారా రూ.3 కోట్లు వచ్చిందన్నారు. టీటీడీ వార్షిక బడ్జెట్‌ రూ.3200 కోట్లు కాగా ఇందులో జీతాలకే రూ.1350 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఇప్పటివరకు కార్పస్‌ ఫండ్‌ నుంచి నిధులు తీసుకోలేదని.. భవిష్యత్‌లో అవసరాన్ని బట్టి టీటీడీ బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆగస్టు నెలాఖరు తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే అన్‌లాక్‌ నిబంధనలను బట్టి శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

అర్చకులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు

తిరుమల శ్రీవారి కల్యాణోత్సవాలను ఆపాలని అర్చకులు కోరలేదని, అర్చకులు ఎలాంటి సలహాలిచ్చినా స్పందిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న అర్చకులకు తిరుమలలో విధులు కేటాయించవద్దని ప్రధానార్చకులకు చెప్పామన్నారు. అర్చకులను ఇబ్బందికి గురిచేసి దర్శనాలు చేయించాలనే ఆలోచన టీటీడీకీ లేదని ఈవో స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy