హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): గోదావరి జలాలను గరిష్ఠంగా వినియోగించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Telangana CM Revanth Reddy) నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.
ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేర నీటిని ఎత్తిపోయాలని దిశానిర్దేశం చేశారు. ఈరోజు (బుధవారం) ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో నీటిపారుదల శాఖపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు.
మేడిగడ్డతో పాటు సుందిళ్లలోనూ లోపాలు..
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఎన్డీఎస్ఏ సూచనలు పాటించాలని సీఎం ఆదేశించారు. మేడిగడ్డతో పాటు సుందిళ్లలోనూ లోపాలు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. దేవాదుల నుంచి 9 పంపులతో ఎత్తిపోతల చేపట్టామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల్లో చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. ప్రాజెక్టుల కింద పెండింగ్లో ఉన్న పరిహారం, పునరావాస చెల్లింపులు వేగవంతం చేయాలని సూచించారు.
ఆ గ్రామాలకు వెంటనే పరిహారం చెల్లించాలి..
ముంపు గ్రామాలపై అధికారులు క్షేత్రస్థాయి వాస్తవ నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. తక్షణ ప్రభావం పడే గ్రామాలకు వెంటనే పరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ పరిహారం పూర్తయితే బస్వాపూర్, గౌరవెల్లి ప్రాజెక్టుల్లో నీరు నింపే అవకాశం ఉందని వివరించారు. గట్టు, గూడెందొడ్డి ఎత్తిపోతల సామర్థ్యం పెంపుపై సమగ్ర అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు కన్సల్టెంట్ను నియమిస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...

