Dailyhunt
ఆ చెంపదెబ్బతో హర్భజన్‌కు రూ.కోటి ఆదాయం: శ్రీశాంత్

ఆ చెంపదెబ్బతో హర్భజన్‌కు రూ.కోటి ఆదాయం: శ్రీశాంత్

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌ తొలి సీజన్‌లో మాజీ ఆటగాళ్లు హర్భజన్ సింగ్, శ్రీశాంత్ మధ్య జరిగిన 'చెంపదెబ్బ' ఘటన మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో ఈ వివాదంపై చాలా రచ్చ జరగ్గా..

తాజాగా మరోసారి మాజీ పేసర్‌ శ్రీశాంత్‌ స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశాడు. చెంపదెబ్బ ఘటనను ఉపయోగించుకుని హర్భజన్‌ (Harbhajan Singh) రూ. కోటి ఆదాయం పొందాడంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివాదంపై శ్రీశాంత్ స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఆ ఇంటర్వ్యూలో శ్రీశాంత్ మాట్లాడుతూ..' హర్భజన్ గురించి నేను ఇప్పటివరకు ఎక్కడా మాట్లాడలేదు. నాకు తెలిసి.. అతడి గురించి ప్రస్తావించడం ఇదే తొలిసారి. గతంలో మా ఇద్దరి మధ్య జరిగిన చెంపదెబ్బ ఘటన గురించి నేను పట్టించుకోవడం మానేశా. కానీ, ఇటీవల హర్భజన్‌ దానిపై ఓ యాడ్ చేశాడు. దాన్నుంచి రూ.కోటి వరకు ఆదాయం పొందాడు. అక్కడితో ఆగకుండా ఆ యాడ్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయమని నాకు చెప్పాడు. అందుకు నేను సమాధానం ఇస్తూ.. నేను నిన్ను క్షమిస్తాను.. కానీ ఆ ఘటనను జీవితంలో మర్చిపోనూ' అని చెప్పాను' అని శ్రీశాంత్ తెలిపాడు.

'మనకు ఏదైనా చెడు జరిగితే.. దానికి కారణమైన వారిని క్షమించాలి కానీ, ఆ చేదు అనుభవాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఒకవేళ మర్చిపోతే.. అవతలి వ్యక్తి మళ్లీ అదే తప్పు చేయాలని చూస్తాడు. అందుకు భజ్జీనే సరైన ఉదాహరణ. ఈ మధ్య చాలా ఇంటర్వ్యూల్లో హర్భజన్‌ ఈ ఘటన గురించి ప్రస్తావించాడు. తాను చాలా పెద్ద తప్పు చేశానని సానుభూతి పొందే ప్రయత్నం చేశాడు. అతడిదంతా నటనేనని అప్పుడే అర్థమైంది. వ్యక్తిగతంగా నాకు అతడిపై ద్వేషం లేదు. కానీ, ఒకట్రెండు నెలల క్రితం ఈ యాడ్‌ చేయడంతో భజ్జీని ఇన్‌స్టాలో బ్లాక్‌ చేశా' అని శ్రీశాంత్ విమర్శించాడు.

చెంపదెబ్బ అసలు కథ ఏంటంటే..?

2008లో ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి సీజన్‌లో శ్రీశాంత్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడగా, హర్భజన్ ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నాడు. ముంబయి ఇండియన్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మధ్య జరిగిన ఓ మ్యాచ్ అనంతరం ఆటగాళ్లంతా షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి శ్రీశాంత్‌ చెంపపై హర్భజన్‌ దెబ్బ కొట్టాడు. దీంతో శ్రీశాంత్‌ మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఘటన అనంతరం భజ్జీపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. అతడిపై ఎనిమిది మ్యాచ్‌ల నిషేధం విధించింది. 18 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటన ఇటీవల ఐపీఎల్‌ మాజీ ఛైర్మన్‌ లలిత్ మోదీ దీని వీడియో విడుదల చేయడంతో మళ్లీ చర్చనీయాంశమైంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy