హైదరాబాద్: నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక తర్వాత టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని టీపీసీసీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ అన్నారు. గురువారం ఆయన టీపీసీసీ కార్యాలయంలో ఏబిఎన్తో మాట్లాడుతూ సాగర్లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి గెలుపు ఖాయమైందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి అంటే కేటీఆర్ బ్యాంక్ బ్యాలన్స్, కవిత నగల పెరుగుదల కాదని విమర్శించారు. 2018 ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిందని, ఈ ఎన్నికల్లో అదే రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు. తమిళనాడులో ఎన్నికల కారణంగా తాను సాగర్లో ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయానని పేర్కొన్నారు. కాంగ్రెస్కు నాగార్జున సాగర్ బలమున్న నియోజక వర్గమని, సాగర్కు దుబ్బాక చాలా వ్యత్యాసం ఉందని మాణిక్కం ఠాగూర్ అన్నారు.

