హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ప్రతిభావంతులైన మైనారిటీ విద్యార్థులను ఆగస్టు 13వ తేదీన సన్మానిస్తామని తెలంగాణ మంత్రి అజహరుద్దీన్ (Telangana Minister Azharuddin) పేర్కొన్నారు.
సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా విద్యార్థుల సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల సన్మాన కార్యక్రమం ఏర్పాట్లపై మంత్రి అజహరుద్దీన్ ఈరోజు (బుధవారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రూప్-1, గ్రూప్-2లో ప్రతిభ చూపిన మైనారిటీ విద్యార్థులను సన్మానిస్తామని చెప్పుకొచ్చారు.
IIT-JEE, EAPCETలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానిస్తామని మంత్రి వెల్లడించారు. SSC, ఇంటర్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన TGMREIS విద్యార్థులను సత్కరిస్తామని వివరించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, కుటుంబ సభ్యులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. భద్రత, ట్రాఫిక్, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. అగ్నిమాపక భద్రత, పౌర సదుపాయాలు, లాజిస్టిక్స్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించామని తెలిపారు.
వివిధ శాఖల మధ్య సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. మైనారిటీ విద్యార్థుల విద్యా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. విద్యార్థుల విజయాలు మరింత మంది యువతకు స్ఫూర్తిగా నిలవాలని మంత్రి అజహరుద్దీన్ పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...

