హైదరాబాద్, జులై 31: ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలకు ఆగస్టు చివరి వారంలో శ్రీకారం చుడతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
క్యూర్ (CURE)లో ఇందిరమ్మ టవర్స్ టెండర్ ప్రక్రియ ప్రారంభం చేస్తామన్నారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. తొలి విడతలో 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. మరో 4 నియోజకవర్గాల్లో స్థలాల గుర్తింపు పూర్తయిందని చెప్పారు. లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఆగస్టు 10వ తేదీ తర్వాత ఈ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేదన్నారు.
ఆధార్తో పాటు ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్బుక్ కూడా చెల్లుబాటు అవుతుందని వివరించారు. ఇల్లు రాకపోతే రూ.10 వేల ఈఎండీ 100 శాతం రీఫండ్ చేస్తామని స్పష్టం చేశారు. UPI లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లిస్తే అదే ఖాతాకు నగదు రీఫండ్ చేస్తామని చెప్పారు. ఒక్కో ఫ్లాట్ మార్కెట్ విలువ రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉందని వివరించారు.
లబ్ధిదారుల పేరుపై 20 నుంచి 22 గజాల అన్డివైడెడ్ షేర్ ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపారు. ఫలక్నుమా ప్యాలెస్ సమీపంలోనూ ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. పేదలకు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో గౌరవప్రదమైన నివాసం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మార్కెట్లో నకిలీ ఎరువులు విక్రయాలు.. రైతులకు వ్యవసాయ శాఖ బిగ్ అలర్ట్
నకిలీ నంబర్ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం.. క్రిమినల్ కేసులు నమోదు

