Dailyhunt
ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 'ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్'

ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 'ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్'

హైదరాబాద్: 'ఆజాది కా అమృత్ మహోత్సవ్-ఇండియా75' వేడుకల్లో భాగంగా యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ అధ్వర్యంలోని నెహ్రూ యువ కేంద్రం శనివారం సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్స్ లో 'ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్' కార్యక్రమాన్ని నిర్వహించింది.

నెహ్రూ యువ కేంద్రం, తెలంగాణా ప్రాంతీయ కార్యాలయం చేపట్టిన ఈ పరుగును నెహ్రూ యువ కేంద్రం, జాతీయ వైస్ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చక్కని ఆరోగ్యం కోసం పౌరులందరూ వారి రోజూవారీ జీవితంలో కనీసం 30 నిమిషాల శారీరక ధారుడ్య వ్యాయామాలు అలవాటుగా చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ అంశం తెలియచేయడమే ఈ 'ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్' కార్యక్రమం ముఖ్య ఉద్ధేశ్యమని అన్నారు. కార్యక్రమంలో భాగంగా యువతతో 'ఫిట్ ఇండియా' ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ గీతం పాడిన తరువాత విద్యార్థులు, పౌరులు రన్ సాగించారు.నెహ్రూ యువ కేంద్ర రాష్ట్ర డైరెక్టర్ అంశుమన్ ప్రసాద్ దాస్ మాట్లాడుతూ, దీన్ దయాళ్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సుమారు 200 మందికి పైగా, విద్యార్ధులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, క్రీడాకారులు, నెహ్రూ యువ కేంద్రం అనుబంధ సంస్థల ప్రతినిధులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ పరుగులో ఉత్సాహంగా పాల్గొన్నారు. హైదరాబాద్ నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి కుమారి ఖుష్బూ గుప్త, జిల్లా యువజన, క్రీడల అధికారి సుధాకర్, ప్రోగ్రామ్ సూపర్ వైజర్ చంద్రశేఖర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy