హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రోగులకు అవసరమైన ఆక్సీజన్ కొరత లేకుండా తాను, మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారుల బృందం నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కాబట్టే మన వద్ద ప్రభుత్వ ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సీజన్ బ్యాంక్లు ఉన్న దగ్గర ఇబ్బంది రావడం లేదు. సిలిండర్ల విషయంలో కొంత కొరత ఉందని ఆయన తెలిపారు. గురువారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కొంత మంది కావాలనే కొరత సృష్టిస్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నవారు అయినా ప్రజలే. వివక్ష చూపవద్దని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు.
ఇక కరోనా టెస్టుల విషయానికి వస్తే ఆర్టిపీసీఆర్ చేయడానికి 104 కేంద్రాల్లో 30వేల పరీక్షలుచేస్తున్నాం. మిగిలినవి అన్నీ రాపిడ్ చేస్తున్నాం. అవసరం అయితే రోజుకు 2లక్షల పరీక్షలు కూడా చేస్తామని మంత్రి ఈటల తెలిపారు. రాపిడ్లో పాజిటివ్ వస్తే ఖచ్చితంగా పాజిటివ్ కాబట్టి లక్షణాలు లేని వారంతా హోమ్ ఐసోలేషన్ ఉండాలన్నారు. ఒక వేళ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వచ్చి పరీక్ష చేయించుకోవాలని చెప్పారు. ఏం కాదులో అని ఇంట్లో ఉంటే వారికి వైరస్ తీవ్రత ఎక్కువవుతుందన్నారు. అలాంటప్పుడు వెంటిలేటర్ దొరకడం, దొరికినా బ్రతకడం కష్టం అవుతుందన్నారు. కాబట్టితాత్సారం చేయొద్దని మంత్రి పేర్కొన్నారు.

