అమరావతి: ఆర్థిక సంక్షోభం దిశగా ఏపీ వెళ్తొందని కాగ్ రిపోర్టు తేల్చింది. రాష్ట్రం పదినెలలకు తీసుకున్న రుణం రూ. 73,913 కోట్లకు చేరిందని నివేదికలో కాగ్ పేర్కొంది. బడ్జెట్లో అంచనా రూ.48,295 కోట్లు కాగా.. ఇది అంచనాకన్నా 153 శాతం ఎక్కువ అని తెలిపింది. ఇక రెవెన్యూ లోటు పెరిగిపోతోందని, ఇది 300 శాతం అధికమని కాగ్ అంటోంది. బడ్జెట్లో రెవెన్యూ లోటు అంచనా రూ.18, 434 కోట్లు ఉండగా.. అసలు రెవెన్యూ లోటు రూ.54,046 కోట్లు ఉందని రిపోర్టులో ప్రస్తావించింది. రెవెన్యూ రాబడి పెరిగినా సంక్షేమ కార్యక్రమాలతో అప్పుల ఊబిలో ఏపీ చిక్కుకుంది. గతేడాది జనవరి నెలాఖరు వరకు అప్పులు రూ.46,503 కోట్లు తీసుకుందని, బహిరంగ మార్కెట్ రుణాల సేకరణలో ఏపీకి దేశంలో 4వ స్థానంలో ఉందని కాగ్ తెలిపింది.
బహిరంగ మార్కెట్లో రుణాలు తీసుకున్నా.. ఏపీ స్టేట్ అవసరాలు తీరలేదని నివేదికలో కాగ్ తెలిపింది. డిసెంబర్లో 30 రోజుల స్పెషల్ డ్రాయింగ్, 26 రోజుల చేబదుళ్లు.. మూడు రోజుల ఓవర్ డ్రాఫ్ట్ను కాగ్ పరిశీలించింది.
మార్కెట్ ద్వారా నిధుల సేకరణతో పాటూ ఏపీ ప్రభుత్వం మూడు మార్గాల ద్వారా రుణాలు తీసుకుంది. డిసెంబర్ నెలను కాగ్ పరిశీలనకు తీసుకుంది. డిసెంబర్లో 30 రోజుల పాటు స్పెషల్ డ్రాయింగ్స్, 26 రోజుల పాటు చేబదుళ్లు, మూడు రోజుల పాటు ఓవర్ డ్రాప్ట్కు వెళ్లారని కాగ్ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందనేది కాగ్ నివేదిక చూస్తే అర్థమవుతుంది. బహిరంగ మార్కెట్లో రుణాలు తీసుకుని.. ఇంకా రుణాలు తీసుకునేందుకు అవకాశాలు లేనప్పుడే ఈ మూడు మార్గాలను ఉపయోగించుకోవడానికి ప్రభుత్వాలకు అవకాశం ఉంటుంది.
ఈ నేపథ్యంలో ''ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోందా?. ప్రజాస్వామ్య సంక్షోభానికి ఆర్థిక సంక్షోభం తోడయితే పరిస్థితి ఏంటి?. మరో అయిదు నెలలైతే ప్రైవేటు అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదా?. చేసిన అప్పులతో అభివృద్ధికి ఒక్క ఇటుకైనా వేశారా?. దోపిడీ కోసమే చేస్తున్న సంక్షోమం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతోందా?.'' అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.

