ముంబై: అయోధ్యలో భూముల కొనుగోలు విషయంలో శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ఆర్థిక అవకతవకలకు పాల్పడిందంటూ సమాజ్వాది పార్టీ నేత తేజ్ నారాయణ్ పాండే చేసిన ఆరోపణలపై శివసేన ఎంపీ సంజయ్ తీర్థ్ సోమవారంనాడు స్పందించారు. ట్రస్టుపై వచ్చిన ఆరోపణలు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన అన్ని హక్కులను ట్రస్టుకు ఇవ్వడం జరిగిందని, ప్రపంచ వ్యాప్తంగా రామభక్తులంతా ట్రస్టుకు విరాళాలు ఇచ్చారని పేర్కొన్నారు. రామాలయ నిర్మాణానికి శివసేన కూడా విరాళం ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
''అయోధ్యలో రామాలయ నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగదని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టును మనం నమ్మాం.
అయితే ట్రస్టుపై వచ్చిన ఆరోపణలు చూస్తే మనందరి నమ్మకాలు, మనోభావాలు గాయపరచేలా ఉన్నాయి'' అని సంజయ్ రాత్ అన్నారు. సమాజ్వాది పార్టీ చేసిన ఆరోపణలపై ట్రస్టు అధిపతి ముందుకు వచ్చి, వివరణ ఇవ్వాలని ఆయన సూచించారు.
కాగా, ట్రస్టు భూముల కొనుగోలులో అవినీతి జరిగిందని, దానిపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని ఎస్పీ నేత తేజ్ నారాయణ్ పాండే డిమాండ్ చేశారు. రూ.2 కోట్లు విలువచేసే భూమికి రూ.18.5 కోట్లు చెల్లించారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలు పూర్తిగా తప్పదారి పట్టించేలా, రాజకీయ విధ్వేషంతో చేసినవేనని టెంపుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కొట్టిపారేశారు.

