
- జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు
అరసవల్లి: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ నెల 27న ఉదయం 10 గంటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షత న జరుగనున్న మాలల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని జయప్రదం చేయాలని టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టా పురుషోత్తం పిలుపునిచ్చారు.
శనివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి సుమారు 20,000 మంది హాజరుకానున్నారని తెలిపారు. గడిచిన నాలుగేళ్ల వైసీపీ పాలనలో అధికంగా నష్టపోయింది దళితులేనన్నారు. దళితుల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ దళితులపై సాగించిన దమనకాండను నిరసించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లాలో గల ప్రతీ నియోజకవర్గం నుంచి టీడీపీ మాలల మాజీ సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, ప్రజా సంఘాల నాయకులు హాజరు కావాలని కోరారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి గోర సురేష్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పీంఎంజే బాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోనెల అప్పారావు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి లింగాల రాజయ్య, కల్యాణ వెంకటరావు, కొవ్వాడ రాజు, యాగంటి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.