Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐపీఎల్‌ 2026: సాయి సుదర్శన్ అరుదైన రికార్డు

ఐపీఎల్‌ 2026: సాయి సుదర్శన్ అరుదైన రికార్డు

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ జోరు కొనసాగుతోంది. వరుసగా ఐదో విజయంతో ప్లే ఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. మంగళవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఏకంగా 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. 86 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్, రబాడా, హోల్డర్ విజృంభించిన వేళ.. స్వల్ప ఛేదనలో హైదరాబాద్ తేలిపోయింది. అయితే గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్(61) ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ సీజన్‌లో 500కి పైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో సాయి సుదర్శన్ ఓ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.

సన్‌రైజర్స్‌పై మ్యాచ్‌లో సాయి సుదర్శన్ 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో 500కి పైగా పరుగులు మార్క్‌ను అందుకున్న తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలోనే 24 ఏళ్ల వయసులోపు మూడు వేర్వేరు సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు సాధించిన తొలి ప్లేయర్‌గా సాయి సుదర్శన్ రికార్డులకెక్కాడు. ఈ ఫీట్ ఇప్పటి వరకు ఎవరూ సాధించలేకపోయారు. ఇంతకుముందు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 24 ఏళ్ల వయసులోపు రెండు సీజన్లలో 500 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలో వరుసగా మూడు లేదా అంతకంటే ఎక్కువ సీజన్లలో 500కి పైగా పరుగులు సాధించిన నాలుగో ప్లేయర్‌గా సుదర్శన్ నిలిచాడు. ఈ జాబితాలో సుదర్శన్ కంటే ముందు డేవిడ్ వార్నర్(2014-2017), కేఎల్ రాహుల్(2018-2021), విరాట్ కోహ్లీ(2023-2025) ఉన్నారు. కాగా గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున మూడుసార్లు 500+ పరుగులు చేసిన తొలి ప్లేయర్ కూడా సుదర్శనే కావడం విశేషం. ఇదిలా ఉంటే, ఈ సీజన్‌లో 12 మ్యాచుల్లో ఎనిమిది విజయాలు సాధించిన జీటీ.. ఆర్సీబీని వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy