న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని వచ్చే నెల 28 వరకు పొడిగిస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. అయితే, డీజీసీఏ అనుమతి పొందిన అంతర్జాతీయ కార్గో, ప్రత్యేక విమానాలకు ఈ నిషేధం వర్తించదని పేర్కొంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో గతేడాది జూన్లో అంతర్జాతీయ విమానాలపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. కరోనా ఆంక్షల కారణంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడంతో ఇటీవల పలు రంగాల్లో ఆంక్షలను సడలించింది. అయినప్పటికీ అంతర్జాతీయ విమాన సర్వీసులపై మాత్రం నిషేధాన్ని కొనసాగించింది. అయితే, కేస్-టు-కేస్ విధానంలో అనుమతించిన కొన్ని రూట్లలో మాత్రం విమానాలు నడుస్తున్నాయి.

