ప్రకాశం జిల్లా, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి (AP Minister Dola Bala Veeranjaneya Swamy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పారదర్శకంగా జరిగిన డీఎస్సీలో వైసీపీ నేతలు నానాయాగి చేస్తున్నారని ధ్వజమెత్తారు. డీఎస్సీ అడ్డుకోవడం కోసం 350కు పైగా కేసులను వైసీపీ నేతలు వేశారని ఆగ్రహించారు. ఆ కేసులన్నీ కోర్టులు పరిష్కరించాయని వెల్లడించారు. ఈరోజు (ఆదివారం) ప్రకాశం జిల్లాలో మంత్రి డీబీవీ స్వామి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎప్పుడు డీఎస్సీ ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇచ్చామని వ్యాఖ్యానించారు.
9 నెలలు ఉద్యోగాలు చేసిన తర్వాత ఏదో అన్యాయం జరిగిందని వైసీపీ నాయకులు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. ఏపీ హైకోర్టు కూడా వైసీపీ నేత డీఎస్సీపై వేసిన పిల్ను కొట్టివేసిందని ప్రస్తావించారు. పార్లమెంట్లో వాయిదా తీర్మానం పెడితే అక్కడ కూడా తిరస్కరించారని చెప్పుకొచ్చారు. అన్యాయం జరిగిందని ఒక్క డీఎస్సీ అభ్యర్థి కూడా బయటకు రావడం లేదని.. కానీ డీఎస్సీపై ఆయా గ్రామాల్లో వైసీపీ నాయకులే ర్యాలీలు చేయడం విడ్డూరంగా ఉందని సెటైర్లు గుప్పించారు.
వైసీపీ అక్రమాలపై ఉద్యోగస్తులు తిరగపడుతున్నారని మంత్రి అన్నారు. అరాచకాలు, అక్రమాలు చేసే ఆ పార్టీ కనుమరుగైపోయిందని విమర్శించారు. మంత్రి నారా లోకేశ్ రాజీనామా అడిగే ముందు వైసీపీ నాయకులకు అసలు బుద్ధుందా అని ప్రశ్నించారు. తలకిందులుగా తపస్సు చేసినా వైసీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...

