అమరావతి, మే 24: రాష్ట్రంలో గత వారం రోజులుగా ఎండలు తీవ్రరూపం దాల్చాయి. మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో ఈ తరహా ఎండల తీవ్రత ఉంటుందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. అత్యవసరం అయితే తప్ప ఉదయం 11.00 నుంచి సాయంత్రం 4.00 గంటల మధ్య ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు స్పష్టం చేసింది. వడగాల్పుల తీవ్రత అత్యధికంగా ఉందని.. దాంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఈ రోజు వివిధ ప్రాంతాల్లో ఎండల తీవ్రతను వివరించింది.
తూర్పుగోదావరి జిల్లాలోని చిట్యాలలో 48.3 డిగ్రీలు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 48.1 డిగ్రీలు, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరంలో 47.3 డిగ్రీలు, కృష్ణా జిల్లా నందివాడలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 174 మండలాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

