ఇంటర్నెట్ డెస్క్: బద్రీనాథ్ ఆలయ విరాళాల అవకతవకలపై దర్యాప్తు చేయడానికి శ్రీ బద్రీనాథ్ - కేదార్నాథ్ టెంపుల్ కమిటీ (బీకేటీసీ) నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
మంగళవారం నుంచే ఈ కమిటీ దర్యాప్తును మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే శ్రీ బద్రీనాథ్ - కేదార్నాథ్ టెంపులు కమిటీ ఓ సిబ్బందిపై వేటు వేసింది. విరాళాలు చోరీ చేశాడన్న ఆరోపణల కారణంగా అతడిని విధుల నుంచి సస్పెండ్ చేసింది.
దీనిపై బీకేటీసీ చైర్మన్ హేమంత్ ద్వివేది స్పందిస్తూ.. 'ప్రైవేట్ సెక్రటరీగా పని చేసే ప్రమోద్ నౌతియాల్ను విధుల నుంచి సస్పెండ్ చేశాం. ప్రాథమిక దర్యాప్తులో విరాళాల విషయంలో అతడు అవకతవకలకు పాల్పడినట్లు తెలిసింది' అని పేర్కొన్నారు. ఇక, సస్పెండ్ అయిన ప్రమోద్ నౌతియాల్పై మంగళవారం రాత్రి బద్రీనాథ్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ ఎఫ్ఐఆర్ నమోదైంది. అతనిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 306, 316(5) కింద కేసులు నమోదు అయ్యాయి.
శరావేగంగా గవర్నమెంట్ కమిటీ దర్యాప్తు..
ఆలయ విరాళాల వివాదంపై మరో వైపు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆదేశాల మేరకు ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటైంది. ఈ హై-లెవల్ కమిటీకి గర్వాల్ డివిజనల్ కమిషనర్ ఆనంద్ స్వరూప్ నాయకత్వం వహిస్తున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ తివారీ, మెడికల్ హెల్త్ సర్వీసెస్ ఫైనాన్స్ డైరెక్టర్ జగత్ సింగ్ చౌహాన్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. బద్రీనాథ్ ఆలయ విరాళాలు, కానుకల లెక్కింపులో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి 15 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఈ కమిటీని ఆదేశించారు.

