Dailyhunt
భారతీయులకు భూమి అంటే.. తల్లి : ప్రధాని మోదీ

భారతీయులకు భూమి అంటే.. తల్లి : ప్రధాని మోదీ

గౌహతి : భూభాగం అంటే కేవలం చెట్టు, పుట్ట, గడ్డి, గుట్టలు మాత్రమే కాదని, భారతీయుల దృష్టిలో భూమి అంటే తల్లి అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అస్సామీ సంస్కృతిని, భాషను పరిరక్షించడానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని హామీ ఇచ్చారు. కాపాడటమే కాకుండా దానిని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అసోంలో పర్యటించారు. అర్హులైన వారికి ఇళ్ల పట్టాలను అందచేసి, ప్రసంగించారు. ఇళ్ల పట్టాలను అందించిన తర్వాత లక్షలాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం సిద్ధించి ఇన్ని రోజులు గడిచినా, లక్షలాది మంది స్వదేశీ కుటుంబాలకు ఇళ్లపై చట్టబద్ధమైన హక్కులు కల్పించకపోవడం శోచనీయమన్నారు.

దీంతో భూములు కలిగి ఉన్నా, లేని వారిలాగే ఉండిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటి నుంచి మాత్రం వారి జీవితాలు చాలా బాగుంటాయని మోదీ పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు 2.5 లక్షల మందికి పట్టాలను పంపిణీ చేస్తే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాల సంఖ్య ఆరు లక్షలకు చేరిందని ఆయన పేర్కొన్నారు. అసోంలో వేగవంతమైన అభివృద్ధి జరగడమే తమ ప్రాధాన్యమని, ఆత్మ విశ్వాసంతో ఆత్మనిర్భర అస్సాం వైపు ప్రయాణించాలని ప్రధాని ఆకాంక్షించారు. కోవిడ్‌ను అరికట్టడంలో అస్సాం ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని, అదే సమర్థతతో వ్యాక్సినేషన్‌ను కూడా పూర్తి చేస్తుందన్న విశ్వాసాన్ని ప్రధాని మోదీ వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy