Dailyhunt

భూ సేకరణపై కౌంటర్‌ దాఖలు చేయండి

అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా యర్రజెర్ల, మర్లపాడు, కొణిజేడు, సర్వేరెడ్డిపాలెం తదితర గ్రామాల భూములను ఇళ్ల స్థలాలకు పంపిణీని సవాల్‌ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యా యమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు ఇవ్వజూపిన భూమిలో పశువుల్ని మేపుకుంటున్నారని, ఆ భూమిని ఇళ్ల స్థలాలకు ఇస్తే వారంతా తీవ్రంగా నష్టపోతారని పిటిషనర్ల న్యాయవాది వివరించారు. అందువల్ల ఇళ్లపట్టాల పంపిణీపై స్టే విధించాలని అభ్యర్థించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ వాదనలు వినిపిస్తూ..

పిటిషన్ల వెనుక ఓ రాజకీయ పార్టీకి చెందిన నేత ఉన్నారని ఆరోపించారు. ఈ పిటిషన్‌తో తనకు సంబంధమే లేదని, సమస్యల పరిష్కారం కోసమంటూ తమ గ్రామ నేత తెల్లకాగితంపై సంతకం తీసుకుని ఇలా తన పేరుతో పిటిషన్‌ వేశాడంటూ పిటిషనర్లలో ఒకరు తహసీల్దారుకు రాసిచ్చారని వివరించారు. ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇళ్ల పట్టాల పంపిణీపై స్టే ఇచ్చేందుకు నిరాకరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy