విజయవాడ: రాష్ట్రంలో ప్రజలపై ప్రభుత్వం పన్నుల భారం మోపిందని, బీజేపీ రాష్ట్ర నాయకులు పన్నులు తగ్గించాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఏపీ పౌర సమాఖ్య కన్వీనర్ బాబూరావు ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పన్నుల పెంపులో ప్రధాన సూత్రధారి కేంద్రంలోని బీజేపీయేనని, ఇప్పుడు వాళ్లు పోరాడతామంటే... అది మోస పూరిత ప్రకటన కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ నేతలకు చిత్త శుద్ధి ఉంటే ప్రధాని మోదీని కలిసి పన్నులు రద్దు చేయాలని డిమాండ్ చేయాలన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసే పన్నుల భారాలు మోపడం వాస్తవం కాదా అని నిలదీశారు.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి జీ హుజూర్ అనే రీతిలో పని చేస్తుందని బాబూరావు అన్నారు.
అప్పుల కోసం ఆరాటపడి రెండువేల కోట్ల అప్పు కోసం పది వేల కోట్ల భారం ప్రజలపై మోపారని మండిపడ్డారు. దీనిపై ఈ నెల 16, 17 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామన్నారు. కరోనా కష్ట కాలంలో ప్రజల జేబులు గుల్ల చేయడం సంక్షేమం కాదన్నారు. బీజేపీ నాయుకుల వ్యాఖ్యలు దొంగే దొంగా దొంగా అన్నట్లుగా ఉందని బాబూరావు వ్యాఖ్యానించారు.
