Dailyhunt
బీజేపీని సవాలు చేసే సత్తా 'ఆప్‌'కే ఉంది: కేజ్రీవాల్

బీజేపీని సవాలు చేసే సత్తా 'ఆప్‌'కే ఉంది: కేజ్రీవాల్

సూరత్: ఇతర పార్టీలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకోవడం వల్లే గత 25 ఏళ్లుగా బీజేపీ గుజరాత్‌ను ఏలుతూ వచ్చిందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశంలో బీజేపీని సవాలు చేయగలిగిన పార్టీ ఆప్ మాత్రమేనని అన్నారు. గుజరాత్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ న్నికల్లో ఆప్ తొలిసారిగా అడుగుపెట్టి, సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ)లో 27 సీట్లు గెలుచుకుంది. ఆప్ అభ్యర్థుల ఘనవిజయాన్ని పురస్కరించుకుని శుక్రవారం నిర్వహించిన రోడ్‌షోలో కేజ్రీవాల్ పాల్గొన్నారు.

ఆప్‌కు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లను ఉద్దేశించి ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ గొప్పగా చేసిందేమీ లేదని, ఎన్నో సమస్యలు ఉన్నాయని అన్నారు.

'గత 25 ఏళ్లుగా బీజేపీ రాష్ట్రాన్ని ఎందుకు ఏలుతోంది? ఏదో గొప్పగా చేసినందుకు మాత్రం కాదు. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక్క పార్టీ మాత్రమే పాతికేళ్లుగా ఏలుతోంది' అని కేజ్రీవాల్ అన్నారు. దేశంలో భారతీయ జనతాపార్టీని సవాలు చేయగలిగే పార్టీ ఆప్ ఒక్కటేనని అన్నారు. గుజరాత్‌లో ఆప్ సాధించిన విజయం ఆ రాష్ట్రంలో నూతన రాజకీయాలకు ఆరంభ సూచకమని అన్నారు. కాంగ్రెస్ ప్రతిచోటూ ఊడ్చిపెట్టుకు పోయిందని, సూరత్ మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. సూరత్‌లో 120 సీట్లలో బీజేపీ 93 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్, ఇతర పార్టీలు ఒక్క సీటు కూడా గెలుచుకులేకపోయాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy