విజయనగరం: మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్గా అశోక్ గజపతిరాజును పునర్నియమించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ దేశంలో చట్టాలు ఉన్నాయని, రాజ్యాంగం ఉందని మాన్సాస్ ట్రస్ట్ విషయంతో రుజువైందన్నారు. ''వివాదం జరిగి ఇన్ని రోజులు గడిచాయి. ఎక్కడెక్కడ శాశ్వత డేమేజెస్ జరిగాయో చూడాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు సింహచలం దేవస్థానం గోశాలలో గోవుల ప్రాణాలు పోయాయి. వాటిని సంరంక్షించాల్సింది పోయి వాటిని హింసించి చంపారు. వాటి ప్రాణాలు ఎవరు తెస్తారు?. 105 దేవాలయాల్లో పరిస్థితులు చూడాలి. ఇప్పుటివరకు ఏం జరిగింది అనేది తెలుసుకుని రిస్టోర్ చేయాల్సి ఉంది. ప్రభుత్వం కూడా ఎంత వరకు సహకరిస్తుంది అనేది చూడాలి.
ట్రస్టు చైర్మన్తో పాటు సింహచలం దేవస్థానం చైర్మన్ పదవి నుంచి తొలగించారు. డిస్మిస్ ఆర్డర్ ఇచ్చారు. వాదనలు విన్న తరువాత కోర్టు దాన్ని కొట్టేసింది. నాపై ఆరోపణలు హాస్యాస్పదం.
నేను రామతీర్ధాలు దేవస్థానానికి విరాళం ఇస్తే తిప్పి పంపారు. నేను చైర్మన్గా ఉన్న సమయంలో అక్రమాలు జరిగాయి అని వాదించారు. ఎలాంటి నష్టం జరిగిందో చెప్పలేకపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాలి అని కోరుతున్నాను. అధికారులు ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి. కోర్టు తీర్పు పూర్తి పాఠం వచ్చిన తర్వాత మిగతా వివరాలు వెల్లడిస్తాను'' అని అశోక్ గజపతిరాజు అన్నారు.

